మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ లంచం డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆదిలాబాద్ఏసీబీ డీఎస్పీ మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ రాథోడ్ బిక్కు కుమ్రం భీమ్ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి డీసీవోగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ పీఏసీఎస్ సెక్రటరీ జక్కుల వెంకటేశంగౌడ్ సొసైటీ నిధుల అక్రమాలపై 2020లో సస్పెండ్ కాగా.. పోస్టింగ్ ఇవ్వలేదు.
2024లో బెజ్జూర్పీఏసీఎస్లో అక్రమాలు జరిగినట్టు తేలడంతో అదే ఏడాది నవంబర్లో ఇన్చార్జి సెక్రటరీ సంజీవ్తో పాటు వెంకటేశం గౌడ్ కూడా సస్పెండ్అయ్యారు. కాగా ఆయనకు రావాల్సిన సగం జీతం ఆపడమే కాకుండా జీవో.44ను అమలు చేయలేదు. డబ్బుల చెల్లింపుతో పాటు సస్పెన్షన్ఎత్తివేతకు ఇన్చార్జి డీసీవో రాథోడ్బిక్కును వెంకటేశంగౌడ్ సంప్రదించారు. రూ.10 లక్షలు డిమాండ్ చేయగా రూ.5లక్షలకు ఒప్పుకున్నాడు. తొలి విడతలో రూ.2లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. అనంతరం బాధితుడు ఏసీబీకి కంప్లయింట్ చేశాడు.
మంచిర్యాలలోని ఇక్బాల్ అహ్మద్ నగర్లో రాథోడ్ బిక్కు ఇంట్లో వెంకటేశం గౌడ్ శనివారం లంచం డబ్బులు రూ. 2లక్షలు అందజేశాడు. ఆదిలాబాద్ఏసీబీ డీఎస్పీ మధు సిబ్బందితో దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అనంతరం కలెక్టరేట్లోని ఆఫీసుకు తీసుకెళ్లి విచారించారు. ఆయనను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ తెలిపారు. మరోవైపు ఇచ్చోడలోని బిక్కు ఇంట్లో ఏసీబీ రైడ్స్ చేశారు. రాథోడ్ బిక్కు గతంలో ఆసిఫాబాద్ ఇన్చార్జి డీసీవోగా పనిచేస్తూ ప్రమోషన్పై మంచిర్యాల డీసీవోగా గత సెప్టెంబర్ లో బాధ్యతలు చేపట్టారు. గతంలో సస్పెండైన మరో సెక్రటరీ నుంచి కూడా రూ.9 లక్షలు తీసుకుని జాబ్ ఎక్కేందుకు ఆర్డర్ ఇచ్చినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
