
ఆర్మూర్, వెలుగు: డీసీఎం, బైక్ ఢీకొనడంతో అన్నదమ్ములు చనిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ శివారులో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ పట్టణంలోని దోభీ ఘాట్ ఏరియాకు చెందిన కొండూరు నాగార్జున (22), కొండూరు నరేంద్ర (20) అన్నదమ్ములు. వీరు బుధవారం బైక్పై మెట్పల్లికి వెళ్లారు.
అక్కడ పని ముగించుకొని తిరిగి వస్తుండగా చేపూరు శివారులోని మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణగౌడ్ తెలిపారు.