తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. మొదటా ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అదుపుతప్పిన కారు .. పిట్టగోడను ఢీకొట్టింది. తిరుపతి నుండి తిరుమలకు వెళ్తుండగా అలిపిరి సమీపంలోని వినాయకుడి గుడి దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఇంకా రిజిష్ట్రేషన్ కాని కొత్తకారుకు ఇలా ప్రమాదం జరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో శ్రీకాకుళంకు చెందిన పద్మ అనే మహిళతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.
తిరుమల కొండెక్కాలంటేనే జంకుతున్న భక్తులు
కలియుగ దైవం కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది దేశ, విదేశాల నుంచి వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకోవాలంటే ఘాట్ రోడ్ల మీదుగా ప్రయాణం చేయాల్సిందే. అయితే, తిరుమల ఘాట్ రోడ్లపై గతంలో ఎప్పుడూ లేనట్లుగా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజుల్లో వ్యవధిలో వరుస యాక్సిడెంట్లతో అటు భక్తులు.. ఇటు టీటీడీ (TTD) అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. రెండు ఘాట్ రోడ్లలో కలిపి పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు.