న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు వ్యవహరించాల్సిన పద్ధతులు, బాధితుడు బీమా సొమ్ము పొందాల్సిన విధానం గురించి కేంద్ర రోడ్డు మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ (మ్యాక్ట్) ద్వారా క్లెయిమ్లను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడానికి డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్టు (డీఏఆర్)ను సమర్పించాలని ఆఫీసర్లను ఆదేశించింది. యాక్సిడెంట్తో సంబంధం ఉన్న టైమ్లైన్లను రిపోర్ట్ చేయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. దీని ప్రకారం ఇక నుంచి వెహికల్ బీమా కాపీలోని మొబైల్నంబర్ల వెరిఫికేషన్ తప్పనిసరి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ) డీఏఆర్తో పాటు ఫారమ్–2 కాపీ అందించాలి. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వస్తాయి. రోడ్డు ప్రమాదం సమాచారం అందిన వెంటనే, పోలీసు దర్యాప్తు అధికారి ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి, ఆ ప్రదేశంతోపాటు ప్రమాదంలో చిక్కుకున్న వెహికల్ ఫోటోలు తీయాలి. సైట్ ప్లాన్ను సిద్ధం చేయాలి.
48 గంటల్లో సమాచారం ఇవ్వాలి...
దర్యాప్తు అధికారి ఫారం–1లో ఎఫ్ఐఆర్ను చేర్చి ప్రమాదం జరిగిన 48 గంటలలోపు క్లెయిమ్ ట్రిబ్యునల్కు వివరాలను తెలియజేయాలి. బీమా పాలసీ వివరాలు అందుబాటులో ఉంటే, ఫారమ్–1లో ప్రమాదానికి కారణమైన వెహికల్ వివరాలను పేర్కొంటూ సంబంధిత బీమా కంపెనీ నోడల్ అధికారికి కూడా ఇస్తారు. ఫారమ్–1 కాపీని బాధితులు, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, బీమా సంస్థకూ అందజేయాలి. వీలైతే రాష్ట్ర పోలీసుల వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయాలి. రోడ్డు ప్రమాదాల బాధితుల హక్కులను వారికి పది రోజుల్లోపు తెలియజేయాలి. డీఏఆర్తో పాటు ఫారమ్–2 కాపీని కూడా ఐఓ అందించాలి. ప్రమాదానికి గురైన వెహికల్డ్రైవర్కు ఖాళీ ఫారమ్–3 కాపీని అందించాలి. నెలలోపు ఐఓకు ఫారం–3లో సంబంధిత సమాచారాన్ని డ్రైవర్ అందజేయాలి. ప్రమాదంలో మైనర్లు ఉంటే బాధితులకు ఖాళీ ఫారమ్–-6ఏని అందజేయాలి. వాళ్లు సంబంధిత సమాచారాన్ని పూరించి రెండు నెలల్లో ఇవ్వాలి.