- ఓ యువకుడు మృతి, మరొకరికి గాయాలు
- తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్న పట్టించుకోని పోలీసులు
మాదాపూర్, వెలుగు: మాదాపూర్ లో కేబుల్బ్రిడ్జిపై రోజురోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అర్ధరాత్రి టైంలో ఫొటోలు, సెల్ఫీ వీడియోలు తీసుకునేందుకు, ఇన్స్టా రీల్స్ చేసేందుకు యువతీయువకులు బ్రిడ్జిపైకి వస్తున్నారు. ఆ టైంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు యువకులు కేబుల్బ్రిడ్జిపై సెల్ఫీలు దిగుగుతుండగా అటుగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు.
మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సిటీలోని పర్వత్నగర్లో ఉండే కె.అనిల్(27) డ్రైవర్. యూసఫ్గూడ పరిధిలోని జవహర్నగర్కు చెందిన కె.అజయ్(25) డైలీ లేబర్. వీరిద్దరూ కలిసి కలిసి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లారు. అక్కడ ఫోన్లో సెల్ఫీలు తీసుకుంటుండగా, ఐకియా నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు వారి మీదికి దూసుకొచ్చింది. అనిల్, అజయ్ను ఢీకొట్టి వెళ్లిపోయింది. అనిల్పై నుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
అజయ్కు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని సమీపంలోని ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున అనిల్మృతి చెందాడు. శనివారం ఉదయం అజయ్డిశ్చార్జ్అయ్యాడు. ఈ మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఉన్న సీసీ కెమెరాలను చెక్చేసి పోలీసుల కారును ట్రేస్చేశారు. కారు యజమాని వెంకట్రెడ్డి తన ఇన్నోవా కారును ఫ్రెండ్కు ఇచ్చానని చెప్పారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రక్షణ చర్యలు చేపడతామని ఇన్స్పెక్టర్ మల్లేశ్తెలిపారు.
రక్షణ చర్యలు శూన్యం
హైదరాబాద్కు ఐకానిక్గా మారిన కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదాలు పెరుగుతున్నా సైబరాబాద్పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి సూసైడ్స్పాట్గా మారింది. బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వీటికితోడు రోజూ అర్ధరాత్రిళ్లు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువతీ యువకులు కేబుల్ బ్రిడ్జిపైకి చేరుకొని ఫొటోలు దిగుతున్నారు. ఇన్స్టాగ్రాం రీల్స్చేస్తున్నారు. వెహికిల్స్ రద్దీ ఉంటున్నా, రోడ్డు మధ్యలోకి వెళ్లి రీల్స్చేస్తున్నారు. బ్రిడ్జిపై ఇరువైపులా బైకులు, కార్లు నిలిపి ట్రాఫిక్కు కారణమవుతున్నారు.
అయినప్పటికీ సైబరాబాద్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో నిత్యం పెట్రోలింగ్ చేపట్టి కేబుల్బ్రిడ్జిపై బైకులు, కార్లు ఆపకుండా చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం అర్ధరాత్రి వరకు ఫొటోలు దిగుతూ, రీల్స్, బర్త్డే కేక్కటింగ్స్ చేస్తున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇటుగా ట్రావెల్ చేసే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తాం, రక్షణ చర్యలు చేపడుతాం, కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపితే రూ.1000 ఫైన్ విధిస్తాం అని పోలీసు అధికారులు చెబుతున్నారే తప్ప అమలుచేయడం లేదని మండిపడుతున్నారు.