వెలుగు బిజినెస్ డెస్క్: తమ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ ఈ ఏడాది జనవరిలో చేసిన ఆరోపణలన్నీ దురుద్దేశంతో కూడినవేనని మంగళవారం జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ విరుచుకుపడ్డారు. సొంత ప్రయోజనాల కోసమే ఆధారాలు లేని ఆరోపణలను ఆ రిపోర్టు చేసిందని విమర్శించారు. అదానీ గ్రూపు పరువు, ప్రతిష్టలను మంట కలపడమే లక్ష్యంగా హిండెన్బర్గ్ రీసెర్చ్ పెట్టుకుందని పేర్కొన్నారు.
గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను కిందకి పడగొట్టి లాభం సంపాదించాలనేదే వారి ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఎఫ్పీఓ పూర్తి సబ్స్క్రిప్షన్ను పొందినప్పటికీ, ఆ మొత్తాన్ని ఇన్వెస్టర్లకు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు గౌతమ్ అదానీ ఈ సమావేశంలో షేర్హోల్డర్లకు వివరించారు. హిండెన్ బర్గ్ ఆరోపణలను ఖండించామని, అయినా వదలకుండా వెంటాడారని చెప్పారు. వర్చువల్గా జరిగిన అదానీ ఎంటర్ప్రైజస్ ఏజీఎంలో గౌతమ్ అదానీ మాట్లాడారు.
రిపోర్టుతో కుప్పకూలిన షేర్లు....
హిండెన్బర్గ్ రీసెర్చ్ జనవరి నెలలో తెచ్చిన రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల ధరలు పేకమేడలా కూలిపోయాయి. షేర్ల ధరల మేనిప్యులేషన్తోపాటు, అకౌంటింగ్ ఫ్రాడ్స్కూ అదానీ గ్రూప్ పాల్పడుతోందని హిండెన్బర్గ్ రిసెర్చ్ సంచలనాత్మక ఆరోపణలను చేసింది. పర్యవసానంగా ఆ గ్రూప్ షేర్ల మార్కెట్ వాల్యూ ఒక దశలో 145 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలన్నింటినీ తిప్పికొట్టిన అదానీ గ్రూప్ భవిష్యత్లో మరింత పుంజుకోవడానికి తగిన వ్యూహాన్ని రెడీ చేసుకుంది. ఈ దిశలోనే కొన్ని ఎక్విజిషన్లను నిలిపివేయడంతోపాటు, ప్లాన్స్ను కూడా మార్చుకుంది. క్యాష్ ఫ్లోస్ తగినంతగా లేవనే విమర్శలను తిప్పికొట్టడానికి, అంతకుముందు తీసుకున్న కొన్ని అప్పులను సైతం అదానీ గ్రూప్ తిరిగి చెల్లించింది. కొత్త ప్రాజెక్టుల స్పీడ్నూ తగ్గించుకుంది.
మే నుంచి రూ. 11,330 కోట్ల
షేర్లు అమ్మిన ప్రమోటర్లు....
రెండు దశలలో అదానీ గ్రూప్ ప్రమోటర్లు ఈ ఏడాది మే నెల నుంచి రూ. 11,330 కోట్ల విలువైన షేర్లను గ్లోబల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్కి అమ్మేశారు. మరోవైపు అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ కొత్తగా అప్పులు తీసుకుంది. ఈ అప్పుల కోసం అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్లోని 21.4 శాతం వాటాలను కుదువ పెట్టినట్లు ఎన్ఎస్డీఎల్ డేటా చెబుతోంది.
మా ట్రాక్ రికార్డే మా గురించి చెబుతుంది...
మా గ్రూప్ ట్రాక్ రికార్డే గ్రూప్ గురించి వివరాలు చెబుతుంది. సవాళ్లు ఎదుర్కొంటున్న టైములో గ్రూప్కంపెనీలకు మద్దతుగా నిలిచిన షేర్హోల్డర్లకు నా కృతజ్ఞతలు. ఈ క్రైసిస్ సమయంలోనే గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లను సమీకరించాం. అంతేకాదు, ఏ రేటింగ్ ఏజన్సీ గ్రూప్ కంపెనీల రేటింగ్స్ను తగ్గించలేదు. అదానీ గ్రూప్ కంపెనీలపై ఇ న్వెస్టర్లకు అచంచలమైన విశ్వాసం ఉందనడానికి ఇదే నిదర్శనం.