
అదానీ పవర్ షేర్లు 13 శాతం జూమ్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్పై యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు అబద్దాలని సెబీ తేల్చడంతో, ఈ గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం ర్యాలీ చేశాయి. 13 శాతం వరకు పెరిగాయి. దీంతో అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజే సుమారు రూ.62 వేల కోట్లు ఎగిసి రూ.13.96 లక్షల కోట్లకు చేరింది. అదానీ పవర్ షేర్లు శుక్రవారం 13 శాతం పెరగగా, అదానీ టోటల్ గ్యాస్ 7.35శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 5.33శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 5.04శాతం, ఎన్డీటీవీ 5శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 5శాతం లాభపడ్డాయి.
మిగిలిన కంపెనీల్లో సంఘీ ఇండస్ట్రీస్ షేర్లు 1.41శాతం, ఏసీసీ 1.21శాతం, అదానీ పోర్ట్స్ 1.09శాతం లాభపడ్డాయి. కాగా, అదానీ గ్రూప్ షేర్లను మానిప్యులేట్ చేసిందని, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని 2023 జనవరిలో హిండెన్బర్గ్ రిపోర్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఈ గ్రూప్ కంపెనీల షేర్లు 70 శాతం వరకు నష్టపోయాయి. మార్కెట్ క్యాప్ రూ.8.8 లక్షల కోట్లు ఆవిరైంది. ఆ తర్వాత నుంచి సెబీ ఈ అంశంపై దర్యాప్తు జరుపుతోంది. తాజాగా తన తుది ఉత్తర్వుల్లో అదానీ గ్రూప్పై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించింది. ఏ విధమైన నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది.
అదానీ పవర్కు బయ్ రేటింగ్..
బ్రోకరేజ్ కంపెనీలు అదానీ గ్రూప్ షేర్లకు బయ్ రేటింగ్ ఇస్తున్నాయి. సానుకూలంగా ఉన్నామని తెలిపాయి. మోర్గాన్ స్టాన్లీ అదానీ పవర్ను “టాప్ పిక్”గా ప్రకటించి, టార్గెట్ ధరను రూ.818గా నిర్ణయించింది. ఇది కంపెనీ శుక్రవారం క్లోజింగ్ ధర రూ.716 కంటే 30శాతం ఎక్కువ. జెఫరీస్ అదానీ గ్రీన్కు రూ.1,300 టార్గెట్ ధర ఇచ్చింది.
ప్రస్తుత ధర రూ.1,032 తో పోలిస్తే సుమారు 30 శాతం ఎక్కువ. కానీ, జనవరి 2023 పీక్తో పోలిస్తే 63శాతం తక్కువ. “వన్టైమ్ సడెన్గా జరిగే ర్యాలీ ఇది. ఇకపై ఫండమెంటల్స్ ఆధారంగా అదానీ స్టాక్స్ ప్రదర్శన ఉంటుంది” అని ఎస్బీఐ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ సన్నీ అగర్వాల్ పేర్కొన్నారు. అదానీ పోర్ట్స్, అంబుజా, ఏసీసీ వంటి క్యాష్ ఫ్లో ఎక్కువగా ఉత్తత్తి చేసే బిజినెస్లపై ఫోకస్ పెట్టాలని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి రియల్ ఎస్టేట్, ఎయిర్పోర్ట్ వ్యాపారాలు సపరేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.