బిజినెస్ డెస్క్, వెలుగు: వంట నూనెల నుంచి పోర్టుల వరకు వివిధ వ్యాపారాలు చేస్తున్న అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ సంపద విషయంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ను దాటేశారు. నెల కిందట సీనియర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సంపదను దాటిన అదానీ, తాజాగా బిల్గేట్స్ను దాటి గ్లోబల్ రిచ్లిస్ట్లో నాల్గో ప్లేస్కు చేరుకున్నారు. అంతేకాకుండా సంపదలో బిల్గేట్స్కు గౌతమ్ అదానీకి మధ్య 10 బిలియన్ డాలర్లు తేడా కూడా ఉండడం గమనించాలి. ఫోర్బ్స్ రియల్టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం, గౌతమ్ అదానీ & ఆయన కుటుంబం సంపద శుక్రవారం నాటికి 112.9 బిలియన్ డాలర్ల (రూ. 9 లక్షల కోట్ల) కు పెరిగింది. అదే బిల్గేట్స్ సంపద 102.4 బిలియన్ డాలర్ల (రూ. 8.19 లక్షల కోట్ల)కు తగ్గిపోయింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతుండడంతో గ్లోబల్గా మైక్రోసాఫ్ట్ వంటి టెక్, ఐటీ కంపెనీల షేర్లు పడుతున్నాయి. దీంతో బిల్గేట్స్ సంపద తగ్గింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పెరుగుతుండడంతో గౌతమ్ అదానీ సంపద పెరిగింది. ఈ ఏడాది గౌతమ్ అదానీ సంపద 32 బిలియన్ డాలర్లు (రూ.2.56 లక్షల కోట్లు) పెరగగా, ఇదే టైమ్లో బిల్గేట్స్ సంపద 36 బిలియన్ డాలర్లు (రూ. 2.88 లక్షల కోట్లు) తగ్గింది. ఫోర్బ్స్ రియల్టైమ్ బిలియనీర్స్ లిస్టులో టాప్లో టెస్లా బాస్ ఎలన్ మస్క్ కొనసాగుతుండగా, రెండో ప్లేస్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ (లూయిస్ విట్టన్), మూడో ప్లేస్లో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 87.3 బిలియన్ డాలర్ల సంపదతో 10 వ ప్లేస్లో ఉన్నారు.
ఎయిర్పోర్టుల చుట్టూ ఎరో సిటీలు..
దేశంలోని మెజార్టీ ఎయిర్పోర్టులను ఆపరేట్ చేస్తున్న గౌతమ్ అదానీ, ఈ ఎయిర్పోర్టుల చుట్టూ రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్లను డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అదానీ ఎయిర్పోర్ట్స్ సుమారు 7 కోట్ల చదరపు అడుగుల ల్యాండ్ను ఈ ప్రాజెక్ట్ల కోసం డెవలప్ చేయనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ ఎయిర్పోర్టులలో 500 ఎకరాల ల్యాండ్ అదానీ ఎయిర్పోర్టులలో అందుబాటులో ఉందని అంచనా. అదానీ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ డెవలప్ చేసే ‘ఎరో సిటీ’ లలో హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, రిటైల్, ఎంటర్టైన్మెంట్, హెల్త్కేర్ ప్రాజెక్ట్లు ఉంటాయి. అంతేకాకుండా లాజిస్టిక్స్, కమర్షియల్ ఆఫీసులు, ఇతర రియల్ఎస్టేట్ సెగ్మెంట్లలోని ప్రాజెక్ట్లను కూడా డెవలప్ చేయాలని చూస్తున్నారు.
అదానీ గ్రూప్ చేతికి ఇజ్రాయిల్ పోర్టు..
ఇజ్రాయిల్లోని అతిపెద్ద పోర్టు అయిన హైఫా పోర్టును కొనేందుకు అదానీ పోర్స్ట్ టెండర్ గెలుచుకుంది. ఇజ్రాయిల్ కంపెనీ గాడట్ గ్రూప్తో కలిసి ఈ మెగా పోర్టును కొనుగోలు చేయనుంది. డీల్ విలువ 1.18 బిలియన్ డాలర్లు (రూ.9,440 . హైఫా పోర్ట్ కంపెనీ లిమిటెడ్లోని 100 % షేర్లను కొనుగోలు చేయడానికి అదానీ పోర్ట్స్–గాడట్ గ్రూప్ కన్సార్టియంకు అవకాశం దక్కింది. ఈ పోర్టు 2054 వరకు వీరి కంట్రోల్లో ఉంటుంది. హైఫాలో అదానీ పోర్ట్స్కు 70% వాటా, గాడట్ గ్రూప్కి 30 % వాటా దక్కుతుంది. కాగా, హైఫా పోర్టు ద్వారా ఇజ్రాయిల్లో సగం కంటైనర్ కార్గో జరుగుతోంది.