న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ గ్రూప్ ఫండమెంటల్గా బాగానే ఉందని, కానీ, అప్పులు చేసి ఇతర కంపెనీలను కొంటుండడంతో ఫ్యూచర్లో ఈ గ్రూప్ రేటింగ్స్పై ఒత్తిడి పెరుగుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. పోర్టుల, ఎయిర్పోర్టులు, ట్రాన్స్మిషన్ లైన్స్, గ్రీన్ ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ..ఇలా అనేక రంగాల్లో విస్తరించిన అదానీ గ్రూప్ తాజాగా సిమెంట్ సెక్టార్లో కూడా అడుగుపెట్టింది. తన సిమెంట్ బిజినెస్ కోసం ఏకంగా 10.5 బిలియన్ డాలర్లు (రూ. 84 వేల కోట్లు) వెచ్చించి హోల్సిమ్ ఇండియా సబ్సిడరీలను కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఒక అల్యూమినియం ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కూడా అదానీ గ్రూప్ చూస్తోంది. ఈ బిజినెస్ విస్తరణ అంతా అప్పుల ద్వారానే కంపెనీ చేపడుతోంది. ‘అదానీ గ్రూప్కు చెందిన చాలా కంపెనీలు పెద్ద మొత్తంలో వృద్ధి చెందాలని చూస్తున్నాయి. ఇతర కంపెనీలను కొనుగోలు చేస్తూ ఈ కంపెనీలు విస్తరిస్తున్నాయి. అదానీ పోర్ట్స్ను చూస్తే ఈ కంపెనీ బిజినెస్ ఫండమెంటల్గా సాలిడ్గా ఉంది.
సాధారణంగా పోర్టు బిజినెస్లో క్యాష్ ఫ్లోస్ బాగుంటాయి. కానీ, ఈ కంపెనీ చేపట్టిన అక్విజేషన్ల (ఇతర కంపెనీలు కొనడం) దగ్గరే రిస్క్ ఉంది. అప్పులు చేసి మరీ అక్విజేషన్లు చేయడంతో కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్ పోతోంది’ అని ఎస్ అండ్ పీ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేటింగ్స్) అభిషేక్ దంగ్రా అన్నారు. ప్రస్తుత స్థాయిలోనే భవిష్యత్లో కూడా అక్విజేషన్లు చేపడితే అదానీ గ్రూప్పై ప్రెజర్ పెరుగుతుందని పేర్కొన్నారు. టార్గెట్ పెట్టుకున్నట్టు ఫండింగ్ను దక్కించుకున్నా లేదా గ్రోత్ను చేరుకున్నా ప్రస్తుత పరిస్థితులను ఈ గ్రూప్ మేనేజ్ చేయగలుగుతుందని అన్నారు. దేశంలోని బ్యాంకులు, ఇంటర్నేషనల్ క్యాపిటల్ బాండ్ మార్కెట్ ఇన్వెస్టర్లు అదానీ కంపెనీలను ఒక గ్రూప్గా చూస్తున్నారని అభిషేక్ అభిప్రాయపడ్డారు. కాగా, తాజాగా ఎన్డీటీవీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడానికి కూడా అదానీ గ్రూప్ రెడీ అయిన విషయం తెలిసిందే.