బెంగళూరు: కర్నాటకలో వచ్చే ఏడేళ్లలో రూ.లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని అదానీ పోర్ట్స్ సీఈఓ కరణ్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ఇప్పటి వరకు రూ.20 వేల కోట్లను ఇన్వెస్ట్ చేశామని ‘ఇన్వెస్ట్ కర్నాటక 2022’ సమ్మిట్లో పాల్గొన్న ఆయన పేర్కొన్నారు. సిమెంట్, పవర్, సిటీ పైప్డ్ గ్యాస్, ఇడిబుల్ ఆయిల్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, డిజిటల్ వంటి వివిధ సెక్టార్లలో బిజినెస్ చేస్తున్న అదానీ గ్రూప్ తమ బిజినెస్లను మరింతగా విస్తరించాలని ప్లాన్స్ వేస్తోంది.
‘మేము అన్ని సెక్టార్ల కోసం కర్నాటకలో ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులను కలిపితే వచ్చే ఏడేళ్లలో రూ. లక్ష కోట్లు అవుతుంది’ అని కరణ్ వివరించారు. ఈ రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో భారీగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా, అదానీ గ్రూప్ తమ సిమెంట్ బిజినెస్ విస్తరణను కర్నాటకలో చేపట్టింది. ఇప్పటికే ఏడాదికి 70 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న నాలుగు ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను విస్తరిస్తున్నామని, ఈ సిటీలో అదానీ విల్మర్ కూడా తమ బిజినెస్ను విస్తరించనుందని కరణ్ వివరించారు.