అదానీ విల్మార్ ప్రాఫిట్ పైకే
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పవర్ ఈ ఏడాది జూన్తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేసింది. కంపెనీ నికర లాభం క్యూ1 లో 16 రెట్లు పెరిగి రూ. 4,779.86 కోట్లకు చేరుకుంది. కిందటేడాది జూన్ క్వార్టర్లో రూ. 278.22 కోట్ల లాభాన్ని ప్రకటించింది. రెవెన్యూ బాగా పెరగడంతో కంపెనీ నికర లాభం క్యూ1 లో భారీగా పెరిగింది. అదానీ పవర్ రెవెన్యూ కిందటేడాది జూన్ క్వార్టర్లో రూ. 7,213.21 కోట్లుగా ఉండగా, ఈ జూన్ క్వార్టర్లో రూ. 15,509 కోట్లకు ఎగిసింది. ఖర్చులు మాత్రం రూ. 6,763.50 కోట్ల నుంచి రూ. 9,642.80 కోట్లకు పెరిగాయి. మార్కెట్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నామని అదానీ పవర్ ఎండీ అనిల్ సార్దానా అన్నారు. పెరిగిన పవర్ డిమాండ్ అందుకోవడానికి ప్రయత్నించామని చెప్పారు. రెగ్యులేటరీ సమస్యలు ఓ కొలిక్కి వస్తున్నాయని, లాంగ్టెర్మ్ స్ట్రాటజీలను చేరుకోవడానికి, షేరు హోల్డర్ల వాల్యూని పెంచడానికి లిక్విడిటీ అందుబాటులో ఉందని అన్నారు. దేశంలోని థర్మల్ కరెంట్ను ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద కంపెనీల్లో అదానీ పవర్ ఒకటి. కంపెనీకి గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, రాజస్తాన్, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 13,610 మెగా వాట్ల కెపాసిటీ ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. దీనికి అదనంగా గుజరాత్లో 40 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది.
అదానీ విల్మార్..
ఎఫ్ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్కు జూన్తో ముగిసిన క్వార్టర్లో రూ. 193.59 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో వచ్చిన రూ. 175.70 కోట్లతో పోలిస్తే ఈసారి కంపెనీ ప్రాఫిట్ 10.8 శాతం పెరిగింది. అదానీ విల్మార్ రెవెన్యూ (కన్సాలిడేటెడ్) 30.23 శాతం పెరిగి రూ. 11,311.97 కోట్ల నుంచి రూ. 14,731.62 కోట్లకు చేరుకుంది. ఫుడ్, ఎఫ్ఎంసీజీ బిజినెస్ నుంచి కంపెనీకి రూ. 860 కోట్ల రెవెన్యూ రాగా, వంటనూనె బిజినెస్ నుంచి రూ. 11,519 కోట్ల రెవెన్యూ వచ్చింది. క్యాస్టర్ ఆయిల్ ఎగుమతులు, ఓలెయో బిజినెస్ నుంచి రూ. 2,353 కోట్ల రెవెన్యూ వచ్చిందని కంపెనీ ప్రకటించింది.