- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: మాతా శిశు మరణాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా డాక్టర్లు, సిబ్బంది ముందుకెళ్లాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శనివారం రిమ్స్లో వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, వివిధ విభాగాల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రసూతి వైద్య సేవలు, టిఫా స్కానింగ్, 108 వాహన సేవలు తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, ఈ సంవత్సరంలో మతాశిశు మరణాలను పూర్తిగా నివారించి, సంకల్ప్ ప్రాజెక్ట్ ద్వారా 2027 నాటికి నవజాత శిశువుల మరణాల రేటును సింగిల్ డిజిట్కు తగ్గించాలన్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. గర్భిణులు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి, డెలివరీ, ప్రసవం జరిగిన తర్వాత కూడా నిరంతర వైద్య పర్యవేక్షణ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.
