ఆదిలాబాద్టౌన్, వెలుగు: పత్తి కొనుగోలులో నాణ్యత పేరుతో అధికారులు నానా ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆరోపించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ అధికారుల తీరును నిరసిస్తూ సోమవారం పత్తి రైతులు ఆందోళనకు దిగారు.
మార్కెట్ యార్డులో బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న జడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. రైతులు కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని వచ్చినా నాణ్యత లేదనే నెపంతో అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పత్తి బాగున్నా పాసింగ్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎంపీ గోడం నగేశ్కు ఫోన్ చేసి సమస్య వివరించగా అధికారులు కొనుగోళ్లు ప్రారంభించారని ఆమె తెలిపారు. అధికారులు స్పందించి కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులు ధర్నా విరమించారు. రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
