నేరడిగొండ, వెలుగు: మనిషి విద్వేషాలకు తావివ్వకుండా ప్రేమను పంచాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ సూచించారు. ఆదివారం ఆయన నేరడిగొండ మండలంలోని తేజాపూర్ లో మూడు రోజులుగా నిర్వహించే సాధు సమ్మేళనం, వేదాంత విజ్ఞాన మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..ప్రపంచంలో అత్యంత గొప్ప నాగరికత భారతదేశానిదని అన్నారు. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరూ మహాభారత, భగవద్గీతను చదివి అహింసను వదలాలన్నారు. చెడు వ్యసనాలను వదిలి ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ ఆశ్రమాలకు చెందిన సాధువులు హాజరై ఆధ్యాత్మిక ప్రవచనాలు, సామూహిక భజనలు, భక్తి గీతాలాపనలతో భక్తులు తన్మయత్వం చెందారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్, భక్తులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
