
సింగపూర్: ఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఇండియా డ్రాతో గట్టెక్కింది. గ్రూప్–సిలో భాగంగా గురువారం సింగపూర్తో జరిగిన మ్యాచ్ను ఇండియా 1–1తో డ్రా చేసుకుంది. ఫలితంగా ఆసియా కప్ క్వాలిఫయింగ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఇక్షాన్ పండి (46వ ని) సింగపూర్కు గోల్ అందించగా, ఇండియా చివర్లో రహీమ్ అలీ (90వ ని) గోల్తో బయటపడింది. ఆట చివర్లో సింగపూర్ చేసిన డిఫెన్సివ్ తప్పిదం ఇండియాకు వరంగా మారింది.
సింగపూర్కు చెందిన జోర్డాన్ ఎమావివే సెంటర్ లైన్ నుంచి కొట్టిన లాంగ్ బ్యాక్ పాస్ను అందుకున్న రహీమ్... ప్రత్యర్థి డిఫెన్స్ను తప్పించి నేర్పుగా గోల్ పోస్ట్లోకి పంపాడు. కీలక డిఫెండర్ సందేశ్ జింగాన్ 47వ నిమిషంలో రెండో ఎల్లో కార్డుతో గ్రౌండ్ బయటకు వెళ్లిపోవడంతో ఇండియా పది మందితోనే ఆడింది.
90 నిమిషాల మ్యాచ్లో ఇండియాకు స్పష్టంగా గోల్ చేసే అవకాశాలే రాలేదు. 60 శాతం సింగపూర్ ఆధిపత్యమే నడిచింది. ప్రస్తుతం ఇండియా రెండు, సింగపూర్ ఐదు పాయింట్లతో కొనసాగుతున్నాయి. రిటర్న్ లెగ్ మ్యాచ్లో భాగంగా ఈ నెల 14న గోవాలో ఇండియా.. సింగపూర్తో తలపడనుంది.