
- వినియోగదారులకు ప్రయోజనం ఉందా అనే విషయాన్ని గమనించనున్న ట్యాక్స్ డిపార్ట్మెంట్
న్యూఢిల్లీ: ఈ నెల 22 నుంచి అమలులోకి వచ్చే కొత్త జీఎస్టీ రేట్లు నిజంగా వినియోగదారులకు లాభం చేకూర్చుతున్నాయా అన్నది నిర్ధారించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్( సీబీఐసీ) వచ్చే ఆరు నెలల పాటు 54 ప్రధాన వినియోగ వస్తువుల ధరలను నిశితంగా గమనించనుంది.
సీబీఐసీ ప్రకటన ప్రకారం, ఫీల్డ్ ఆఫీసులు, ఇండస్ట్రీ అసోసియేషన్ల నుంచి నెలవారీ ధరల వివరాలను సేకరిస్తారు. సెప్టెంబర్ 22కి ముందు ధరలు, ఆ తర్వాత ధరలతో పోల్చి పరిశీలన జరుగుతుంది. మొదటి కంప్లయన్స్ రిపోర్ట్ సెప్టెంబర్ 30న వెలువడుతుంది.
బట్టర్, చీజ్, కార్న్ఫ్లేక్స్, టాయిలెట్ సోప్, టూత్పేస్ట్, కాంటాక్ట్ లెన్స్, స్టేషనరీ, ఏసీలు, టీవీలు వంటి వాటి ధరలను జాగ్రత్తగా గమనిస్తారు. అయితే కార్లు, ఇన్సూరెన్స్ వంటి హై-వాల్యూ కేటగిరీలు ఈ జాబితాలో లేవు. కాగా, జీఎస్టీ కౌన్సిల్ 12శాతం, 28శాతం స్లాబ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 400 వస్తువుల రేట్లు తగ్గాయి. 40శాతం స్లాబ్లో ఇప్పుడు 13 లగ్జరీ, సిన్ గూడ్స్ మాత్రమే ఉన్నాయి.
ఆటో పార్ట్స్ 28శాతం నుంచి 18శాతానికి తగ్గించడంతో పరిశ్రమకు ఊరట లభించింది. కాంపెన్షేషన్ సెస్ తొలగించడంతో కంపెనీలు ధరలు తగ్గించే అవకాశం ఉంది. ప్రభుత్వం పరిశ్రమలను ధర తగ్గింపుల అమలుకు ప్రోత్సహిస్తోంది. ఈసారి యాంటిప్రాఫిటీరింగ్ నిబంధనలను అమలు చేయకపోవచ్చు. ఇది కార్పొరేట్ రంగానికి ఊరటనిస్తుంది.