
- స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయండి
- ఏఐసీసీ పరిశీలకుడు అజయ్ సింగ్
గుడిహత్నూర్(ఇచ్చోడ), వెలుగు: కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తూ.. పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేసే వారికి అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తుందని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే అజయ్ సింగ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సంఘటన్ సృజన్ అభియాన్లో పాల్గొని మాట్లాడారు. పార్టీని బలోపేతానికి కష్టపడేవారికి పదవులు ఇస్తామన్నారు. పారదర్శకంగా డీసీసీ నియామకాన్ని చేపడతామని, కార్యకర్తలు ఫైనల్ చేసిన అభ్యర్థికే డీసీసీ పదవి ఇస్తామని తెలిపారు.
రానున్న స్థానిక ఎన్నికల్లో విభేదాలు లేకుండా పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సృజన్ అభియాన్ కోఆర్డినేటర్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ నరేశ్, ఎన్ఎస్యూఐ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా,సేవాదళ్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.