న్యూఢిల్లీ: బ్లాక్ ఫంగస్ కేసులపై డాక్టర్లంతా అలర్ట్గా ఉండాలని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా సూచించారు. రాబోయే రోజుల్లో ఆ కేసులు మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. కరోనా పేషెంట్లలో ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ను చెక్ చేయాలని, షుగర్ కంట్రోల్లో ఉండేలా చూడాలని అన్నారు. ప్రస్తుతం వస్తున్న బ్లాక్ఫంగస్ కేసుల్లో 95% షుగర్ బాధితులేనని చెప్పారు. స్టెరాయిడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ స్థాయిలు ఎక్కువై బ్లాక్ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. కరోనా ట్రీట్మెంట్లో వాడే టొసిలిజుమాబ్ కూడా కారణమవుతోందా అన్న దానిపైనా పరిశీలన చేస్తున్నామన్నారు. ఫస్ట్వేవ్లో కరోనా తగ్గిపోయాకే బ్లాక్ఫంగస్ ఎటాక్ చేసిందని, కానీ, ఇప్పుడు పాజిటివ్ ఉన్న వారిలోనూ దాని లక్షణాలు కనిపిస్తున్నాయని హెచ్చరించారు. స్టెరాయిడ్లను జాగ్రత్తగా వాడాలని, మోతాదుకు మించి ఇవ్వొద్దని ఆయన సూచించారు.
వేరియంట్లపై వ్యాక్సిన్ పనితీరు తెల్వదు
కరోనా వ్యాక్సిన్ ఫుల్గా (రెండు డోసులు) వేసుకున్నా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని, ఎడం పాటించాల్సిందేనని గులేరియా స్పష్టం చేశారు. వైరస్లో చాలా మార్పులు జరుగుతున్నాయని, ఆ మార్పులతో పుట్టుకొస్తున్న కొత్త రకాలపై ఎన్ని వ్యాక్సిన్లు, ఎంత వరకు పనిచేస్తాయన్నది కచ్చితంగా చెప్పలేమన్నారు. ఫుల్ వ్యాక్సిన్ వేసుకున్నోళ్ల మాస్క్ పెట్టుకోనక్కర్లేదన్న అమెరికా ప్రకటన తొందరపాటేనన్నారు.