మంటలు ఎగిసిపడుతున్నా..పురుడు పోసిన డాక్టర్లు

మంటలు ఎగిసిపడుతున్నా..పురుడు పోసిన డాక్టర్లు

న్యూఢిల్లీ: ఓవైపు ఎగిసిపడుతున్న మంటలు.. మరోవైపు వార్డుల్లోని పేషెంట్ల తరలింపు హడావుడి.. ఇదీ శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ లో నెలకొన్న పరిస్థితి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలోనూ ఎయిమ్స్ డాక్టర్లు తమ డ్యూటీని మర్చిపోలేదు. రోగులకు అందించే చికిత్స విషయంలో ఎలాంటి ఆటంకం రానీయలేదు. అంతేకాదు.. నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీకి పురుడు పోశారు. ఎయిమ్స్​చరిత్రలోనే శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి, రెండో అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. 34 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆస్పత్రి సిబ్బంది రోగులను సురక్షితంగా బయటికి తీసుకెళ్లారు. ముందు జాగ్రత్త చర్యగా గైనకాలజీ వార్డునూ ఖాళీ చేశారు. ఓ గర్భిణీకి మాత్రం అత్యవసరంగా ఆపరేషన్​చేయాల్సి రావడంతో డాక్టర్లు వెంటనే ఆమెను థియేటర్​కు షిప్ట్​చేశారు. అక్కడికి దగ్గర్లోనే ఫైర్​సిబ్బంది మంటలార్పేందుకు శ్రమిస్తుండగా.. ఆపరేషన్​థియేటర్లో డాక్టర్లు శ్రమించారు. రాత్రి 9:30 ప్రాంతంలో బిడ్డను బయటకు తీశారు. తర్వాత వారిని వేరే బిల్డింగ్​లోకి మార్చారు. ఆపరేషన్​సక్సెస్​అయిందని, తల్లీబిడ్డా క్షేమమని డాక్టర్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తమ డ్యూటీని మరవబోమని సీనియర్​డాక్టర్​రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.