ఫ్లైట్లో సాంకేతిక లోపం కనిపించలే.. ఇద్దరు పైలట్లు బ్రీత్ అనలైజర్ టెస్టులు పాసయ్యారు

 ఫ్లైట్లో సాంకేతిక లోపం కనిపించలే.. ఇద్దరు పైలట్లు బ్రీత్ అనలైజర్ టెస్టులు పాసయ్యారు
  • మెడికల్​ పరిస్థితి ఇద్దరిదీ సరిగ్గానే ఉన్నది
  • ఎయిర్​ ఇండియా సీఈవో క్యాంప్‌‌బెల్​ విల్సన్​ వెల్లడి
  • అహ్మదాబాద్​ విమాన ప్రమాదం నివేదికపై స్పందన

న్యూఢిల్లీ:  అహ్మదాబాద్​లో కూలిపోయిన ప్లేన్​లో ఎలాంటి సాంకేతిక లోపం కనిపించలేదని ఎయిర్​ ఇండియా సీఈవో క్యాంప్‌‌‌‌బెల్ ​విల్సన్​ తెలిపారు. విమానం లేదా దాని ఇంజిన్లలో ఎలాంటి యాంత్రిక, నిర్వహణ సమస్యలు లేవని తేలిందని చెప్పారు.  ప్రయాణానికి ముందు ఇద్దరు పైలట్లు బ్రీత్​అనలైజర్​ టెస్టులు పాసయ్యారని తెలిపారు. సోమవారం  ఆ సంస్థలో జరిగిన కార్యక్రమంలో అహ్మదాబాద్‌‌‌‌ విమాన ప్రమాదంపై ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌ బ్యూరో (ఏఏఐబీ) ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్‌‌‌‌పై  క్యాంప్‌‌‌‌బెల్​స్పందించారు. ‘‘విమాన నిర్వహణకు సంబంధించిన తప్పనిసరి టాస్క్‌‌‌‌లన్నీ పూర్తిచేశాం. ఫ్యూయెల్​ క్వాలిటీలో లోపం లేదు. టేకాఫ్​ సమయంలో ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవు” అని పేర్కొన్నారు. పైలట్ల మెడికల్​పరిస్థితికి సంబంధించి ఏఏఐబీ ఎలాంటి లోపాలను ఎత్తిచూపలేదని చెప్పారు.  అధికారుల సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని, ఏఏఐబీ ప్రిలిమినరీ రిపోర్ట్​ విషయంలో ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదం జరిగిన కొన్ని రోజుల్లోనే తమ మొత్తం 787 డ్రీమ్‌‌‌‌లైనర్​ విమానాలను తనిఖీ చేశామని, అన్ని విమానాలు సేవలకు అనుకూలంగా ఉన్నాయని తేలిందని చెప్పారు.

ప్రిలిమినరీ రిపోర్ట్​లో కీలక విషయాలు 

అహ్మదాబాద్‌‌‌‌ నుంచి లండన్‌‌‌‌ వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్‌‌‌‌ 787 విమానం గత నెల 12న టేకాఫ్‌‌‌‌ అయిన వెంటనే కూలిపోయిన సంగతి తెలిసిందే . అందులో ఒక్కరు మినహా ప్రయాణికులు, సిబ్బంది కలిపి 241 మంది మృతిచెందారు. వారితోపాటు విమానం ఓ వైద్యకళాశాల హాస్టల్‌‌‌‌పై కూలిపోవడంతో 29 మంది మరణించారు. దీనిపై గతవారం ఏఏఐబీ 15 పేజీలతో రూపొందించిన ప్రిలిమినరీ రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేసింది. ఇందులో  కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్​ అయిన తర్వాత సెకను వ్యవధిలోనే ఇంజిన్ల ఫ్యుయెల్ కంట్రోల్​​స్విచ్‌‌‌‌లు నిలిచిపోవడంతో ప్రమాదం జరిగిందని అంచనా వేసింది.  అయితే, ఇది ఎలా జరిగిందో నివేదికలో స్పష్టం చేయలేదు. ప్రమాదం వెనక ఎలాంటి కుట్ర కోణం లేదని, పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కన్పించలేదని రిపోర్ట్​ పేర్కొన్నది. కాక్‌‌‌‌పిట్ వాయిస్ రికార్డింగ్‌‌‌‌ ప్రకారం.. ఒక పైలట్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశారని అడిగాడని, మరొక పైలట్ తాను అలా చేయలేదని బదులిచ్చాడని వెల్లడించింది.

ఇంధన స్విచ్​ల కండీషన్ బాగుంది

ఇంధన స్విచ్‌‌‌‌ల వైఫల్యం వల్లే అహ్మదాబాద్‌‌‌‌ ప్లేన్​ క్రాష్​ ఘటన జరిగిందని ఏఏఐబీ తన ప్రిలిమినరీ రిపోర్ట్​లో వెల్లడించిన విషయం తెలిసిందే. విమానంలోని ఇంజిన్ల ఇంధన స్విచ్‌‌‌‌లు రన్‌‌‌‌ నుంచి కటాఫ్‌‌‌‌ మోడ్‌‌‌‌లోకి మారడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.  అయితే, క్రాష్ ​అయిన బోయింగ్​ 787 విమానంలో ఇంజిన్ ఫ్యూయెల్ స్విచ్​లు పూర్తిగా కండీషన్​లోనే ఉన్నాయని యూఎస్​ ఫెడరల్​ ఏవియేషన్​అడ్మినిస్ట్రేషన్​(ఎఫ్ఏఏ), బోయింగ్ కంపెనీ పేర్కొన్నాయి. ఈ విమానంలో కాక్‌‌‌‌పిట్ మాడ్యూల్‌‌‌‌ను ఎయిర్ ఇండియా 2 సార్లు మార్చినట్లు తెలిపాయి. బోయింగ్ మెయింటెనెన్స్​ ప్లానింగ్​ డాక్యుమెంట్​(ఎంపీడీ) ప్రకారం..  ప్రతి 24 వేల విమాన గంటలకు యూనిట్‌‌‌‌ను మార్చాల్సిన అవసరం ఉందని, దీని ప్రకారం లండన్‌‌‌‌కు వెళ్లే డ్రీమ్‌‌‌‌లైనర్ థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ (టీసీఎం)ను 
2019, 2023లో రీప్లేస్​ చేసినట్టు పేర్కొన్నాయి.