
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.10లక్షల జరిమానా విధించింది. చెల్లుబాటయ్యే టికెట్లున్న ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించినందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. లేకుంటే చర్యలు తప్పవని డీజీసీఏ పేర్కొంది. చెల్లుబాటు అయ్యే టికెట్లు ఉన్న ప్రయాణికులు సమయానికి హాజరైనప్పటికీ విమానయాన సంస్థలు బోర్డింగ్ను తిరస్కరించినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో DGCA వరుస తనిఖీలు నిర్వహించింది. ఎక్కడా సంస్థలు నిబంధనలు పాటించడం లేదని తేలింది.
ఎయిర్ ఇండియా సంస్థ రెగ్యులేషన్స్ను అనుసరించడం లేదని వివరించింది. అందుకే ఆ సంస్థకు షోకాజ్ నోటీసు పంపామని DGCA పేర్కొంది. చెల్లుబాటయ్యే టికెట్లున్న ప్యాసింజర్లను బోర్డింగ్కు అనుమతించని సందర్భంలో ఆ ప్రయాణికులకు గంటలోపే మరో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ( మరో విమానాన్ని) చేయాలని డీజీసీఏ నిబంధనలను గుర్తు చేసింది. గంటలోపే ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేస్తే అలాంటి సందర్భంలో ప్రయాణికులకు పరిహారం అందించాల్సిన అవసరం ఉండదని తెలిపింది. ఒకవేళ ఆ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమాన సౌకర్యం ఏర్పాటు చేయడానికి 24 గంటల్లోపు సమయం పడితే.. ప్రయాణికులకు రూ.10వేల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. 24 గంటలు దాటితే ప్రయాణికులకు రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని చెప్పింది.