రావల్పిండి: పాకిస్తాన్లో మంగళవారం తెల్లవారుజామున ఆర్మీ ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ ఘటనలో సిబ్బందితో పాటు 18 మంది చనిపోయారు. వారిలో 13 మంది సామాన్య పౌరులు, మరో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. 11 మందికి గాయాలు కాగా.. వారిలో కొందరి పరిస్థితి సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారు. చనిపోయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ట్రైనింగ్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఫ్లైట్ రావల్పిండి దగ్గర్లోని మోరాకలూ గ్రామంలో కుప్పకూలిందని ఆర్మీ అధికారి చెప్పారు.
విమానం కంట్రోల్ తప్పి ఇళ్ల మధ్యలో పడిందని, ఆరు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసి విమాన శకలాలను తొలగించారు. పాకిస్తాన్లో ఎయిర్ సేఫ్టీ ట్రాక్ రికార్డ్ చాలా పేలవంగా ఉండటంతో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.
గతంలో జరిగిన కొన్ని ప్రమాదాలు
2016లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)కి చెందిన ఫ్లైట్ ఇంజిన్లో సమస్య రావటంతో అబోతాబాద్ కొండల్లో కుప్పకూలింది. ఆ సమయంలో ఫ్లైట్లో 48 మంది ఉన్నారు. వారిలో పాకిస్తాన్ ప్రముఖ సింగర్, డిప్యూటీ కమిషనర్ తదితరులు ఉన్నారు.
2012లో 121 మందితో వెళ్తున్న భోజా ఎయిర్ప్లేన్ బోయింగ్ 737 విమానం ఇస్లామాబాద్లో క్రాష్కు గురైంది. కొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందన్న టైంలో ప్రమాదం జరిగింది.
2010లో కరాచీ నుంచి వస్తున్న ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఎయిర్ బ్లూకు చెందిన ఎయిర్బస్ ఏ 321 క్రాష్ అయింది. ఆ సమయంలో విమానంలో 152 మంది ఉన్నారు.
1992లో 167 మందితో నేపాల్ రాజధాని కాట్మాండుకు వెళ్తున్న పీఐఏకు చెందిన ఎయిర్ బస్ 300 ప్రమాదానికి గురైంది.