తమను సంప్రదించకుండా బీజేపీకి మద్ధతు తెలిపిన అజిత్ పవార్ ను వెనక్కి రప్పించడానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారు. మరో వైపు మహారాష్ట్రలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అజిత్ పవార్ ప్రధాని మోడీకి ట్విటర్ ద్వారా హామీ ఇస్తున్నారు. క్షణక్షణం మలుపుతిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయం దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఆసక్తి ని రేకెత్తిస్తున్నాయి.
రెండవసారి సీఎం గా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. బలపరీక్షపై రేపు సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలిస్తే.. ఎలా వ్యవహరించాలన్నదానిపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ ను తిరిగి తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు శరద్ పవార్ కొందరు నేతలతో అజిత్ పవార్ కు రాయబారం పంపారు.
ఇలాంటి పరిణామాల మధ్య అజిత్ పవార్ ఆదివారం ప్రధాని మోడీకి సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర సీఎం గా, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారాలు చేసిన ఫడ్నవీస్, అజిత్ పవార్ లకు శనివారం నరేంద్ర మోడీ ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆ ట్వీట్ కు ఆదివారం రీట్వీట్ చేశారు అజిత్ కుమార్. ప్రధానమంత్రికి ధన్యవాదాలు. తెలియజేస్తూ.. మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కృషి చేసేందుకు రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రజల బాగు కోసం కష్టపడి పని చేస్తామని తెలిపారు.