కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది కార్పొరేటర్లు తమ పార్టీని వీడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో (ఎన్సీపీ) చేరారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని మాలేగావ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది కార్పొరేటర్లు శరద్ పవార్కు చెందిన ఎన్సీపీలో చేరారు. మాలేగావ్ నగర మేయర్ సహా మొత్తం 28 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎన్సీపీలో చేరినట్లు ఆ పార్టీ ప్రకటించింది. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్ రెండూ మిత్రపక్షాలుగా ఉన్నాయి.
మాలెగావ్ మేయర్తో సహా 28 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు ముంబైలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరియు రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ సమక్షంలో పార్టీలో చేరారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాలెగావ్కు ఎన్సిపి ఎమ్మెల్యే ఉంటారని, ఆ ఎమ్మెల్యే నగర అభివృద్ధికి కృషి చేస్తారని జయంత్ పాటిల్ మరియు అజిత్ పవార్ తెలిపారు. అయితే మాలెగావ్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదలకావడం లేదనే కారణంతోనే తమ పార్టీ కార్పొరేటర్లు పార్టీ వీడారని రాష్ట్ర కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ తెలిపారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ మరియు ఎన్సిపి ఎంవిఎలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, ఇది రాజకీయం. కొంతమంది ఎన్సిపి కార్పొరేటర్లు కూడా త్వరలో మాతో చేరుతున్నారు. నేను ఇప్పుడు ఎక్కువ వివరాలు వెల్లడించలేను’అని అన్నారు.
మాలేగావ్ లో 84 మంది సభ్యులతో కూడిన సివిల్ బాడీలో ఎన్సీపీకి ఇప్పటికే 20 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మాలెగావ్ మున్సిపల్ కార్పొరేషన్లో శివసేనకు 13, బీజేపీకి 9, ఏఐఎంఐఎంకు 7, జేడీ(ఎస్)కి 6, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు.
For More News..