జియో దిగొచ్చింది

జియో దిగొచ్చింది

సాధారణంగా సర్వీస్​ అప్​డేట్​ అయినవి ఎక్కువ లాభపడడం, అప్​డేట్​ కానివి నష్టపోవడం కామన్​. కానీ, టెలికం రంగంలో దీనికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతోంది. ఎయిర్​టెల్​ కస్టమర్లు ఐడియా నంబర్​కి ఫోన్​ చేసి మాట్లాడితే ఎయిర్​టెల్​ కంపెనీ ఐడియాకి నిమిషానికి ఆరు పైసలు ఇవ్వాలి. ఐడియా నంబర్​ వాడేవాళ్లు ఎయిర్​టెల్​ సిమ్​ ఉన్న ఫోన్​కి కాల్​ చేసినా ఐడియా సంస్థ అంతే అమౌంట్​ కట్టాలి. దీన్నే ఇంటర్​కనెక్ట్​ యూసేజ్​ ఛార్జ్​ (ఐయూసీ) అంటారు. రెండు ఫోన్​ నంబర్లూ ఒకే కంపెనీవైతే ఐయూసీ చెల్లింపు అవసరం లేదు. ఐడియా, ఎయిర్​టెల్​తోపాటు ఇతర ఆపరేటర్లు ఈ రంగంలో సీనియర్​ సర్వీస్​ ప్రొవైడర్లు. ఇప్పటికీ చాలా మంది ఫోన్లలో ఈ సిమ్​లే ఉన్నాయి.

జియో కంపెనీ టెలికం సేవలను ఇటీవలే ప్రారంభించింది. కేవలం రూ.49కే నెల మొత్తం అన్​లిమిటెడ్​ కాల్స్​, ఒక జీబీ డేటా అందిస్తోంది. ఐడియా, ఎయిర్​టెల్​ వంటి కొన్ని సంస్థలు ఈ సౌకర్యం కల్పించాలంటే మినిమం రీచార్జి రూ.100 చెల్లించాల్సిందే. జియో సిమ్​ 4జీ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. మిగతా కంపెనీల సిమ్​లకు ఆ రూల్​ లేదు. జియో సిమ్​ వాడాలనుకుంటే అదే సంస్థ అమ్మే ఫీచర్​ ఫోన్​ని రూ.1500 పెట్టి కొనుక్కోవచ్చు.

పేదలు ఎక్కువగా వాడేవి బేసిక్​ ఫోన్లే

జియో మినహా వేరే కంపెనీల ఫోన్లు ఒకవేళ 4జీని సపోర్ట్​ చేసినా వాటిలో ఐడియా, ఎయిర్​టెల్​ వంటి సంస్థల సిమ్​లు వేస్తే అన్​లిమిటెడ్​ కాల్స్​ కోసం మినిమం రూ.100 కేటాయించాల్సిందే. దేశంలో డబ్బు లేనోళ్లే ఎక్కువ మంది ఉన్నారు. పేదల వద్ద, అక్షరమ్ముక్కరానోళ్ల దగ్గర ఎక్కువగా బేసిక్​ ఫోన్లే ఉంటాయి. అవి మహా అయితే 2జీ టెక్నాలజీ వరకే సపోర్ట్​ చేస్తాయి. కాబట్టి జియో సిమ్​ వాడే ఛాన్సే లేదు.

ఈ రోజుల్లోనూ నిమిషానికి రెండు రూపాయలా?

2జీ సబ్​స్క్రయిబర్లు నిమిషం​ కాల్​కి దాదాపు రెండు రూపాయలు (రూ.1.80 పైసలు) చెల్లించాల్సి వస్తోంది. ఈ రోజుల్లోనూ ఇంత టారిఫ్​ ఉండటం నమ్మబుద్ధి కాదు. కానీ, నిజం. అదే 4జీ సబ్​స్క్రయిబర్లకైతే వన్​ మినిట్​ ఫోన్​ కాల్​కి యావరేజ్​గా మూడు పైసల లోపు మాత్రమే పడుతోంది. దీనికితోడు బ్రాడ్​బ్యాండ్​ ఇంటర్నెట్​ యాక్సెస్​ కూడా ఉంటుంది. జియో ఎలాగూ 4జీ కాబట్టి ఆ కస్టమర్లకు ఇబ్బంది లేదు. ఎటొచ్చీ 2జీ సబ్​స్క్రయిబర్లకే సమస్య. కొన్ని టెలికం సంస్థలు కావాలనే తమ టెక్నాలజీని 2జీ నుంచి 4జీకి అప్​డేట్​ చేయట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఐయూసీ వల్లే ఈ భారం

ఇంటర్​కనెక్ట్​ యూసేజ్​ ఛార్జ్​ (ఐయూసీ) గతంలో 14 పైసలు ఉండేది. దాన్ని రెండు దశల్లో జీరోకి తెస్తామని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా (ట్రాయ్​) రెండేళ్ల కిందట చెప్పింది. దీంతో టెలికం ఆపరేటర్లంతా 4జీకి అప్​గ్రేడ్​ అవుతారని, అప్పుడు రీఛార్జ్​ల్లో తేడాలు రావనుకున్నారు. ఐయూసీని 14 పైసల నుంచి ఆరు పైసలకు వచ్చింది. ప్రస్తుతం ఇదే అమలవుతోంది. ఈ ఆరు పైసలను మరో 4 నెలల్లో (2020 జనవరి నుంచి) సున్నా చేయాల్సి ఉంది.  అయితే, ట్రాయ్​ తీరు చూస్తుంటే ఇది అనుమానమే.

ఇప్పడు ఏదీ ఫ్రీ కాదు

తమ సిమ్​ల నుంచి చేసే కాల్స్​ని​ కనెక్ట్​ చేస్తున్న ఇతర టెలికం ఆపరేటర్లకు జియో మూడేళ్లుగా చెల్లిస్తున్న ఇంటర్​కనెక్ట్​ యూసేజ్​ ఛార్జ్​ (ఐయూసీ) రూ.13,500 కోట్లకు చేరింది. ఇది ఆ సంస్థకు భారంగా మారింది. దీంతో ఐయూసీ విషయంలో రాజీపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా.. ఇన్నాళ్లూ వాయిస్​ కాల్స్​ని ఫ్రీగా ఇచ్చిన జియో ఇకపై వేరే నెట్​వర్క్​లకు చేసుకునే కాల్స్​కి నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్​ వేయాలని నిర్ణయించింది. ఈ కాల్స్​ కోసం రూ.10 మొదలుకొని రూ.100 వరకు ఐయూసీ వోచర్​లను అందుబాటులోకి తెచ్చింది. 4జీ నెట్​వర్క్​ భారీగా విస్తరించిన ఈ రోజుల్లోనూ 2జీ పరిధిలో ఇంకా 35–40 కోట్ల మంది సబ్​స్క్రైబర్లు ఉన్నారు. వీరికి జియో నుంచి డైలీ 65–75 కోట్ల నిమిషాల ఔట్​గోయింగ్​ కాల్స్​ వెళుతున్నాయి. వీటిని కనెక్ట్​ చేస్తున్నందున వేరే ఆపరేటర్లకు జియో ఐయూసీని చెల్లించాల్సి వస్తోంది. ఐయూసీ కొత్త రీఛార్జ్​లకే వర్తించేలా బుధవారం నుంచే అమల్లోకి తెచ్చింది.