- రెండో స్థానంలో రిలయన్స్
- టాప్-3లో బజాజ్ గ్రూప్
- హురున్ ఫిలాంత్రపీ లిస్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: హెచ్సీఎల్ టెక్ ఫౌండర్ శివ్ నాడార్, ఆయన కుటుంబం భారీగా సంపాదించడమే కాదు, సమాజం కోసమూ భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా గత ఏడాది రూ. 2,708 కోట్లు విరాళంగా ఇచ్చారు. రోజుకు రూ. 7.4 కోట్ల విరాళం ఇచ్చి ఆయన మనదేశంలో అత్యంత దానశీలిగా నిలిచారు. గత ఐదేళ్లలో ఫౌండేషన్ రూ. 10,122 కోట్లు విరాళంగా ఇచ్చింది. హురున్
ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్ ప్రకారం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ దాతృత్వ విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ రూ. 626 కోట్లతో ఈ జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అత్యధికంగా రూ. 1,309 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇది తప్పనిసరి వ్యయం కంటే రూ. 261 కోట్లు ఎక్కువ. బజాజ్ గ్రూప్ ట్రస్ట్ రూ. 446 కోట్లు ఇచ్చింది. ఈ లిస్టులోని 25 మంది కేవలం మూడేళ్లలో రూ. 50 వేల కోట్లు ఇచ్చారు. అంటే రోజుకు సుమారు రూ. 46 కోట్లు! ఈ ఏడాది జాబితాలో 191 మంది దాతలు (12 మంది కొత్తవారు) ఉన్నారు. వీరంతా కలిపి రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది మూడేళ్ల క్రితంతో పోలిస్తే 85 శాతం ఎక్కువ.
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ల భారీ దాతృత్వం
ఇన్ఫోసిస్ కో-–ఫౌండర్ నందన్ నిలేకని, ఆయన భార్య రోహిణి నిలేకని వరుసగా రూ. 356 కోట్లు, రూ. 199 కోట్లు వ్యక్తిగత విరాళాలు ఇచ్చి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇన్ఫోసిస్ కో–-ఫౌండర్ల కుటుంబాలు (నందన్ నిలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, కె. దినేశ్, రోహిణి నిలేకని, కుమారి శిబులాల్) ఈ ఏడాది మొత్తం రూ. 850 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చి రికార్డు సృష్టించారు. రంజన్ పాయ్, ఆయన కుటుంబం రూ. 160 కోట్లు ఇచ్చింది.
రూంగ్తా సన్స్ రూ. 181 కోట్లు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ రూ. 267 కోట్లు సీఎస్ఆర్కు కేటాయించాయి. ఈ జాబితాలో 24 మంది మహిళలు ఉండగా, రోహిణి నిలేకని రూ. 204 కోట్లు విరాళంగా ఇచ్చి భారతదేశంలో అత్యంత దయాగుణం గల మహిళగా నిలిచారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా రూ. 83 కోట్లు, బీణా షా రూ. 69 కోట్లు విరాళంగా ఇచ్చారు. యువ ఇండస్ట్రియలిస్టుల్లో జెరోధాకు చెందిన నిఖిల్ కామత్, నితిన్ కామత్, బిన్నీ బన్సాల్, అదర్ పూనావాలా ప్రముఖంగా ఉన్నారు. కామత్ సోదరులు రూ. 147 కోట్లు విరాళంగా ఇచ్చారు.
