
ట్యాంక్ బండ్, వెలుగు: కృష్ణా, గోదావరి జలాల్లో ఆంధ్ర పాలకుల అనధికార దోపిడీపై చర్చించేందుకు ఈ నెల 9న సోమాజిగూడలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తెలిపారు. బుధవారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి ఆయన ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ వివిధ లూప్ లైన్ ల ద్వారా చేస్తున్న ఆంధ్ర పాలకుల అనధికార దోపిడీపై చర్చ జరగాలని, అప్పుడే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
ఆంధ్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా, కేంద్ర నిధులు వస్తుండగా, తెలంగాణలో గోదావరి మల్టీపర్పస్, అప్పర్ కృష్ణా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, వీటికి నిధులు, హోదా ఇచ్చిన తర్వాతే కేంద్రం మధ్యవర్తిత్వానికి అర్హత ఉంటుందన్నారు. అనేక అంశాలను వివరిస్తూ వివిధ పార్టీల అధినేతలను కలిసి అఖిలపక్ష సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేశామని, వారు సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. ఆయన వెంట బీసీ ప్రతినిధులు గుజ్జ కృష్ణ, నందగోపాల్, పగడాల సుధాకర్, ఉదయ్ ఉన్నారు.