యూట్యూబ్ చానెల్స్, సోషల్మీడియా .. స్వేచ్ఛను మళ్లీ చంపేశాయ్ : అల్లం నారాయణ

యూట్యూబ్ చానెల్స్, సోషల్మీడియా .. స్వేచ్ఛను మళ్లీ చంపేశాయ్ :  అల్లం నారాయణ
  •  కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్నయ్​ 
  • మీడియా అకాడమీ మాజీ చైర్మన్ ​అల్లం నారాయణ
  • జేసీహెచ్ఎస్ఎల్​ ఆఫీసులో  స్వేచ్ఛకు సంతాప సభ 

హైదరాబాద్​ సిటీ, వెలుగు:  ప్రముఖ జర్నలిస్టు, ది జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ  మేనేజింగ్ కమిటీ మెంబర్​ స్వేచ్ఛ వొటార్కర్ సంతాప సభ మంగళవారం సొసైటీ ఆఫీసులో నిర్వహించారు. అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వేచ్ఛకు నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. స్వేచ్ఛ మరణానంతరం కొన్ని యూట్యూబ్​ చానల్స్​తో పాటు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు బాధను కలిగిస్తున్నాయన్నారు. 

నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయన్నారు. వ్యక్తిగత జీవితంలో చొరబడిన యూట్యూబ్​చానల్స్​తో పాటు సోషల్ మీడియా స్వేచ్ఛను మరోసారి చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానానికి స్వస్తి చెప్పాల్సిన అవసరముందన్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్ టీన్యూస్ ​సీఈఓ, సోసైటీ మాజీ కార్యదర్శి శైలేశ్​​రెడ్డి, కమలాకరాచార్య,  ప్రభాకర్ రావు, ​మహేశ్వర్ గౌడ్, యోగానంద్, మారుతి సాగర్,  బసవ పున్నయ్య, లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి  పాల్గొన్నారు.