
అల్లరి నరేష్, ఆనంది జంటగా ఎ.ఆర్.మోహన్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ నెల 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. గెస్ట్గా వచ్చిన హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘అల్లరి నరేష్ ఫన్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే గమ్యం, నాంది లాంటి డిఫరెంట్ మూవీస్తోనూ మెప్పించారు. ఆయన మరిన్ని గొప్ప పాత్రలు చేయాలి. ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’ అన్నాడు. నరేష్ మాట్లాడుతూ ‘నిర్మాత రాజేష్కి మినీ దిల్ రాజు అని పేరు పెట్టాం. మొదటి సినిమా విడుదల కాకముందే మరో రెండు సినిమాలు మొదలు పెట్టారు. ఆనందికి ఈ సినిమా స్టార్ట్ చేసేప్పటికి మూడు నెలల బేబీ ఉంది. అయినా ఆమె చాలా కష్టపడింది. ఇది సీరియస్ సినిమా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇందులో 40 శాతం కామెడీ వుంటుంది. 60 శాతం ఎమోషన్ వుంటుంది. అన్ని భాషల్లో ఆకట్టుకునే సత్తా వున్న సినిమా ఇది’ అన్నాడు.
‘నా లైఫ్లో ఇది చాలా స్పెషల్ మూవీ. మూడు నెలల బేబీతో షూట్లో జాయినయ్యా. టీమ్ ఇచ్చిన సపోర్ట్ని ఎప్పుడూ మర్చిపోలేను’ అంది ఆనంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది నా 17 ఏళ్ల కల. ఈ కలని నిజం చేసిన అల్లరి నరేష్ గారికి లైఫ్ లాంగ్ థాంక్స్ చెబుతూనే వుంటా. ప్రజల జీవితాన్ని తెరపై చెప్పాలనే కోరికే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' కథ’ అని చెప్పాడు. ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ గారికి అంకితం చేస్తున్నాం అన్నారు నిర్మాత రాజేష్ దండా. దర్శకులు ఇంద్రగంటి మోహన కృష్ణ, తిరుమల కిశోర్, విఐ ఆనంద్, విజయ్ కనకమేడల, వశిష్ట, రామ్ అబ్బరాజు, నిర్మాతలు సతీష్ వర్మ, అభిషేక్ అగర్వాల్ కూడా కార్యక్రమానికి హాజరై మూవీ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.