హైదరాబాద్: చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సంతోష్ బాబు ఫ్యామిలీకి బుధవారం హైదరాబాద్ లోని, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా ఉన్న విలువైన 711 గజాల స్థలాన్ని కేటాయించారు. కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు బంజారా హిల్స్ లో స్థలం కేటాయించినట్లు తెలిపారు హైదరాబాద్ కలెక్టర్ శ్వేత. ఇందుకు సంబంధించిన ఇంటిస్థల డాక్యుమెంట్లను దివంగత కల్నల్ సంతోష్ బాబు సతీమణికి అందజేశామన్నారు కలెక్టర్ శ్వేత.

