న్యూఢిల్లీ: సహారా గ్రూప్లోని నాలుగు కో–ఆపరేటివ్ సొసైటీలలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు వారి డబ్బు తిరిగి చెల్లించడం కోసం సీఆర్సీఎస్–సహారా పేరుతో ఒక పోర్టల్ను మంగళవారం కేంద్ర కో–ఆపరేషన్ మంత్రి అమిత్ షా లాంఛ్ చేశారు. 45 రోజులలోపు ఇన్వెస్టర్ల డబ్బును వాపస్ చేయాలని భావిస్తున్నారు. సహారా గ్రూప్ పెట్టుబడుల విషయంలో చాలా ప్రభుత్వ ఏజన్సీలు పనిచేస్తున్నాయని, ఆయా ఏజన్సీలు చాలా ఆస్తులను సీజ్ చేశాయని చెబుతూ, ఇలాంటి పోర్టల్ తేవడం చరిత్రలో నిలిచిపోతుందని అమిత్ షా చెప్పారు.
డిపాజిటర్ల డబ్బును రాకుండా ఇప్పుడు ఎవరూ ఆపలేరని, పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న 45 రోజులలోపు వారు తమ డబ్బు వెనక్కి పొందవచ్చని పేర్కొన్నారు. నాలుగు సహారా గ్రూప్ కో–ఆపరేటివ్ సొసైటీలలో డిపాజిట్లు చేసిన 10 కోట్ల మంది డిపాజిటర్లకు 9 నెలలలోపు వారి సొమ్ము తిరిగి వచ్చేలా చేస్తామని ఈ ఏడాది మార్చి 29 నాడు ప్రభుత్వం ప్రకటించింది. సహారా–సెబీ రీఫండ్ అకౌంట్ నుంచి రూ. 5 వేల కోట్లను సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్స్కు బదిలీ చేయమని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ప్రభుత్వం పై విధంగా ప్రకటించింది. తొలి దశలో ప్రతి ఇన్వెస్టర్కు రూ. 10 వేల రీఫండ్ లభిస్తుందని, ఎక్కువ మొత్తం పెట్టిన వారికి ఆ తర్వాత మరి కొంత చెల్లింపు జరుగుతందని షా వివరించారు. ఈ మొదటి దశలో 1.7 కోట్ల మందికి రీఫండ్ చేయడానికి పై రూ. 5 వేల కోట్ల మొత్తం సరిపోతుందని పేర్కొన్నారు. నాలుగు సహారా గ్రూప్ కో–ఆపరేటివ్స్లోనూ కలిపి 2.5 కోట్ల మంది రూ. 30 వేల కోట్లను డిపాజిట్ చేశారు.
సహారా క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ, సహారాయాన్ యూనివర్సల్ మల్టిపర్పస్ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టిపర్పస్ కో–ఆపరేటివ్ సొసైటీలు ఈ జాబితాలో ఉన్నాయి. రూ. 5,000 కోట్లను డిపాజిటర్లకు రీఫండ్ చేసిన తర్వాత మరొకసారి సుప్రీం కోర్టును మరింత మొత్తం విడుదల చేయాల్సిందిగా కోరనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. ఐఎఫ్సీఐ సబ్సిడరీ కంపెనీ ఈ పోర్టల్ను డెవలప్ చేసింది. డబ్బు తిరిగి కోరుకునే డిపాజిటర్లు రెండు పనులు చేయాల్సి ఉంటుందని, మొబైల్తో ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మొదటిదని, బ్యాంకు అకౌంట్తో ఆధార్ నెంబరును లింక్ చేసుకోవడం రెండవదని షా చెప్పారు. ఆ బ్యాంకు అకౌంట్లో రీఫండ్ జమ అవుతుందని వెల్లడించారు.