
- ఎల్బీ స్టేడియంలో బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 12న రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్లతో ఆయన సమావేశం కానున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశం కానున్న అమిత్షా.. పార్లమెంట్ఎన్నికల సన్నద్ధతపై వివరించనున్నారు.
ఆ సమావేశం అనంతరం పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గతంలోనే రావాల్సి ఉన్నా..అమిత్ షా రాష్ట్ర పర్యటన ఇప్పటికే రెండుసార్లు రద్దయింది. వాస్తవానికి జనవరి 28న పాలమూరు, కరీంనగర్, హైదరాబాద్ పర్యటనకు ఆయన రావాల్సి ఉన్నది. అప్పుడు బీహార్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నెల 2న కూడా అమిత్ షా సోషల్ మీడియా వారియర్లతో సమావేశమవ్వాల్సి ఉండగా, ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆ పర్యటన కూడా రద్దయింది. తాజాగా 12న అమిత్ షా షెడ్యూల్ను ఖరారు చేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.