బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ ఉంపన్ సోమవారం మధ్యాహ్నానికి పెను తుఫానుగా మారింది. తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పలు తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. తుఫాను బంగాళాఖాతంలో దక్షిణంగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం(ఈ నెల 20) నాటికి బెంగాల్, బంగ్లాదేశ్మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. దిఘా, హాతియా ఐలాండ్ ల మధ్య తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురుగాలులకు తీరప్రాంతాల్లోని గుడిసెలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని, పక్కా ఇండ్లు కూడా దెబ్బతింటాయని చెప్పారు. కరెంట్ స్తంభాలతో పాటు ఇతర కమ్యూనికేషన్ పోల్స్ నేలకూలే అవకాశం ఉందని, పలుచోట్ల కరెంటు సరఫరా దెబ్బతింటుందని అన్నారు. రైల్వే ట్రాక్లు పాక్షికంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పంటలు, ప్లాంటేషన్స్, పూల తోటలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ఒడిశాలోని తీరప్రాంత జిల్లాలు జగత్సింగ్పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్లలో మంగళ, బుధ వారాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ డైరెక్టర్మృత్యుంజయ మహాపాత్ర హెచ్చరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 11 లక్షల మంది ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం వెల్లడించగా.. తీర ప్రాంత జిల్లాల్లో తుఫాను హెచ్చరికలు జారీ చేయడంతో పాటు సహాయక బృందాలను పంపించినట్లు బెంగాల్ సర్కార్ పేర్కొంది. 24 పరగాణాలు, కోల్కతా, ఈస్ట్, వెస్ట్ మిడ్నాపూర్, హౌరా, హూగ్లీ లలో తుఫాన్ ప్రభావం ఉంటుందని, ఇప్పటికే అక్కడికి రిలీఫ్ మెటీరియల్తో పాటు సహాయక సిబ్బంది చేరుకున్నారని అధికారులు చెప్పారు.
కేరళలో భారీ వానలు
తుఫాన్ ప్రభావంతో కేరళలో ఆదివారం రాత్రి పలుచోట్ల పెనుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. కొట్టాయం జిల్లాలోని వైకోమ్ తాలూకాలో పెనుగాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. రాత్రంతా కురిసిన వర్షానికి రోడ్లు డామేజ్ కావడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది.
37 ఎన్డీఆర్ఎఫ్ టీంలు..
తుఫాను హెచ్చరికలతో నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగింది. థబెంగాల్, ఒడిశాలలోని వివిధ ప్రాంతాలకు 37 టీంలను పంపించినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ చెప్పారు. ఇందులో 20 టీంలు యాక్టివ్గా పలు ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండగా.. మిగతా 17 టీంలు స్టాండ్బై గా ఉన్నాయని వివరించారు.
ఏర్పాట్లపై ప్రధాని మోడీ రివ్యూ
సైక్లోన్ ఉంపన్ ప్రభావం, సహాయక ఏర్పాట్లపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రివ్యూ మీటింగ్ తర్వాత మోడీ ట్వీట్ చేశారు. ‘సైక్లోన్కు ఎలా రెడీ కావాలి, ప్రజల్ని సేఫ్ ప్లేస్లకు ఎలా తరలించాలనే ఇష్యూలపై చర్చించాం. అందరూ క్షేమంగా, హ్యాపీగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా. ఏయే చర్యలు తీసుకోవాలో అవన్నీ కేంద్రం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.