
- కర్నాటక సీఎం యడియూరప్ప వెల్లడి
- దేశ ద్రోహం కేసులో 14 రోజులు కస్టడీ
- మా అమ్మాయికి శిక్ష పడాల్సిందే: తండ్రి
బెంగళూరు: సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) వ్యతిరేక సభలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్య లియోనాకు నక్సల్స్తో సంబంధాలు ఉన్నాయని కర్నాటక సీఎం యడియూరప్ప చెప్పారు.అమూల్య లాంటి వారి వెనుక ఉన్న సంస్థలు, వారిని పెంచి పోషిస్తున్నవారిపై చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని, లా ఆండ్ ఆర్డర్ను దెబ్బతీసేందుకు ఇదో కుట్ర అని సీఎం చెప్పారు. “ ఆమె వెనుక ఉన్న సంస్థల గురించి విచారిస్తే విషయాలన్నీ బయటకు వస్తాయి. అమూల్యకు గతంలో నక్సల్స్తో సంబంధాలున్నాయని తెలుస్తోంది. అలాంటి వాళ్లను శిక్షించాలి, వారి వెనుక ఉన్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి” అని యడియూరప్ప అన్నారు. ఆమె తండ్రి కూడా తన కూతుర్ని శిక్షించాలని కోరుతున్నారని అన్నారు. బెంగళూరులో గురువారం ‘సేవ్ ఇండియా’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో అమూల్య అనే అమ్మాయి ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ స్లోగన్స్ చేసింది. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆ సభకు హాజరయ్యారు. ప్రో పాకిస్తాన్ నినాదాలు చేసిన అమూల్యను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై 124ఏ దేశద్రోహం (సెడిషన్) కేసు నమోదు చేసి 14 రోజులు కస్టడీ విధించారు.
బెయిల్ కూడా ట్రై చేయను: అమూల్య తండ్రి
అమూల్య చేసింది క్షమించరాని నేరమని, చట్ట ప్రకారం శిక్ష విధించాలని ఆమె తండ్రి వాజీ అన్నారు. శిక్ష పడితేనే తప్పుతెలుసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఆమె కోసం న్యాయపోరాటం కూడా చేయనని, బెయిల్ కూడా అప్లై చేయనని చెప్పారు. “ అమూల్య దేశ ప్రజలందర్నీ బాధపెట్టింది. ఈ సంఘటనతో చాలా డిస్ట్రబ్ అయ్యాను. ఆమె ఎందుకు అలా నినాదాలు చేసిందో, తన వెనుక ఎవరున్నారనే విషయం తెలియాలి. ఆమె చాలా తెలివైంది. సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనొద్దని వార్నింగ్ కూడా ఇచ్చాను” అని అమూల్య తండ్రి అన్నారు. అమూల్య ఇంటి దగ్గర పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి కొంత మంది అమూల్య ఇంటిపై దాడి చేయడంతో ఆమె తండ్రి కేసు పెట్టారని, ఈ మేరకు సెక్యూరిటీ పెట్టామని పోలీసులు చెప్పారు. అమూల్య తండ్రితో రైట్ వింగ్ కార్యకర్తలు కొంత మంది “ భారత్ మాతాకీ జై” అని నినాదాలు చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాళ్లే రియల్ హీరోస్: వైరల్ అవుతున్న వీడియో
19 ఏళ్ల అమూల్య బెంగళూరు ఎన్ఎమ్కేఆర్వీ కాలేజీలో జర్నలిజం ఇన్ బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఆమె యాంటీ సీఏఏ, ఎన్నార్సీ ర్యాలీల్లో పాల్గొంటోంది. “ నేను కేవలం ఫేస్ మాత్రమే. మీడియా ముందుకు రాకుండా చాలా మంది వెనకుండి పనిచేస్తున్నారు. వాళ్లు రియల్ హీరోస్. మాకు సీనియర్ యాక్టివిస్ట్ల నెట్వర్క్ ఉంటుంది. స్టూడెంట్స్గ్రూప్ ఉంటుంది. మేం ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అని సూచిస్తారు” అని ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమూల్య చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.