బీపీ, గుండె జబ్బుల్ని ముందుగానే పసిగట్టే యాప్స్ వచ్చేశాయి. అలాగే వాయిస్ రికార్డింగ్ విని పార్కిన్సన్స్, సివియర్ కొవిడ్ని గుర్తు పట్టే యాప్ తయారుచేశారు ఆస్ట్రేలియాకు చెందిన రీసెర్చర్లు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తుంది. ఈ యాప్లో వాయిస్ రికార్డు చేస్తే, పది సెకన్లలో వాళ్లకు పార్కిన్సన్స్ డిసీజ్ ఉందా? లేదా? అనేది దాదాపు వంద శాతం కరెక్ట్గా చెప్పేస్తుంది. ఒకవేళ పార్కిన్సన్స్ ఉంటే న్యూరాలజిస్ట్ని కలవాలని సజెస్ట్ చేస్తుంది.
ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ (రాయల్ మెల్బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు ఈ యాప్ తయారుచేశారు. పార్కిన్సన్స్ ఉన్నవాళ్లలో స్వరపేటిక సరిగ్గా పనిచేయదు. దాంతో వాళ్ల మాట తీరు మారుతుంది. అందుకు కారణం... గొంతు దగ్గరి కండరాలు బిగుసుకుపోవడమే. అంతేకాదు శరీరం తూలుతున్నట్టు ఉండడం వల్ల స్వరపేటిక నుంచి మాట సరిగ్గా రాదు. స్టడీలో భాగంగా పార్కిన్సన్స్తో బాధపడుతున్నవాళ్లని, ఆరోగ్యంగా ఉన్నవాళ్లను ఇంగ్లీష్ అక్షరాలు ‘ఎ, ఒ, ఎమ్’ పలకమని చెప్పి. వాళ్ల వాయిస్ని వేరు వేరుగా రికార్డ్ చేశారు రీసెర్చర్లు. ఆ వాయిస్ రికార్డ్ని యాప్లో ప్లే చేశారు. పార్కిన్సన్స్ ఉన్నవాళ్ల గొంతుని ఆరోగ్యంగా ఉన్నవాళ్ల గొంతుతో పోల్చి చూస్తుంది ఇందులోని సాఫ్ట్వేర్. పార్కిన్సన్స్ ఉన్నవాళ్లు ఈ మూడు అక్షరాల్ని ఒకేలా పలకడం గమనించారు. మామూలుగా ఈ డిసీజ్ ఉందా? లేదా? అనేది తెలుసుకోవడానికి 90 నిమిషాలు పడుతుంది. ఈ యాప్ అయితే కేవలం పది సెకన్లలో పార్కిన్సన్స్ టెస్ట్ పూర్తి చేస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్లో ఉంది ఈ యాప్.
ఊపిరితిత్తుల సమస్యల్ని కూడా...
‘‘ఆరోగ్య సమస్యల్ని ముందుగానే గుర్తించడం వల్ల త్వరగా డయాగ్నసిస్, ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుంది. ఏ జబ్బు అయినా తొందరగా నయం కావాలంటే దాన్ని తొందరగా పసిగట్టడం చాలాముఖ్యం. కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు వచ్చినవాళ్లలో కూడా గొంతు మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటిని కూడా గుర్తించొచ్చు. ఈ యాప్ ద్వారా వ్యాధుల్ని గుర్తించడం చాలా ఈజీ. డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కావు” అని చెప్తున్నాడు ఈ స్టడీలో పాల్గొన్న ప్రొఫెసర్ దినేశ్ కుమార్. మనదేశానికి చెందిన ఈయన ఐఐటీ ఢిల్లీలో పీహెచ్డీ చేశాడు. ప్రస్తుతం ఆర్ఎంఐటీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు.