
అమరావతి: నెల్లూరు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంట్లో వేసే మందుకు అనుమతి నిరాకరించింది. ఆనందయ్య మందు వాడితే హాని లేదని CCRAS ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉందని.. దీనిపై క్లారిటీ రావడానికి మరో 2–3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని సూచించింది. ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వం.. వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్లవచ్చని తెలిపింది. దీంతో కోవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని చెప్పింది. ఆనందయ్య మందు పంపిణీ సందర్భంలో కోవిడ్ ప్రోటో కాల్ పాటించాలని ఏపీ సర్కార్ సూచించింది.