బెంగళూరు : టీమిండియా ప్లేయర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. తనను అనాలోచితంగా కెప్టెన్సీ నుంచి తొలగించారని ఏసీఏ పాలకమండలిపై నెల రోజుల కిందట విహారి ఆరోపణలు చేశాడు. దీనిపై స్పందించిన ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అయితే ఈ నోటీసుపై విహారి ఇంకా స్పందించలేదు. ‘అవును.. మేం విహారికి షోకాజ్ ఇచ్చాం.
అతని సమాధానం కోసం వేచి చూస్తున్నాం. అతను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశాడో తెలుసుకోవాలనుకుంటున్నాం. దానిపై మాతో చర్చించలేదు. కనీసం ఇప్పుడైనా వివరణ ఇస్తాడేమో చూడాలి. ఇవన్నీ పక్కనబెడితే డొమెస్టిక్ క్రికెట్లో ఆంధ్ర టీమ్ ఎదగడానికి విహారి చాలా దోహదపడ్డాడు. అందుకే అతనికి విలువ ఇస్తున్నాం’ అని ఏసీఏ అధికారి ఒకరు వ్యాఖ్యానించాడు.