ఏపీలో భారీగా తగ్గిన లిక్కర్ రేట్లు

ఏపీలో భారీగా తగ్గిన లిక్కర్ రేట్లు
  •     క్వార్టర్ బాటిల్ పై రూ.15 నుంచి 20వరకు తగ్గింపు
  •     బోర్డర్ షాపుల్లో సేల్స్ ఢమాల్
  •     టెండర్ల టైంలో బోర్డర్ దుకాణాలకు పోటాపోటీ 

'' ఖమ్మం జిల్లాలోని సరిహద్దు గ్రామానికి చెందిన ఒకాయన వైన్స్​ షాపును డ్రాలో దక్కించుకున్నాడు.  డ్రా జరిగిన రోజే  సిండికేట్​పెద్దలు తలుపు తట్టారు. రెండు రోజులపాటు జరిగిన బేరసారాల్లో సిండికేట్​ పెద్దలు దాదాపు రూ.రెండు కోట్ల వరకు గుడ్​విల్  ఆఫర్​ చేశారు. అంతకుముందు వైన్​షాపు నడిపిన అనుభవం లేకపోయినా సొంతంగానే నడుపుకుంటానని ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశాడు. బార్డర్​ షాపు కాబట్టి  గిరాకీ ఎక్కువ ఉంటుందని, బాగా లాభాలు వస్తాయని ఆశపడ్డాడు. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఏపీలో లిక్కర్​ రేట్లు తగ్గించడంతో  క్రిస్మస్​ పండుగతో పాటు వీకెండ్స్ లో కూడా గిరాకీలేదు.  ఏపీ నుంచి మద్యం ప్రియులు రావడంలేదు.  గుడ్​విల్​ ఇస్తానన్నప్పుడే  లైసెన్స్​ అమ్ముకుంటే బాగుండేదని వాపోతున్నాడు. ''

ఖమ్మం, వెలుగు:  రాష్ట్రంలోని ఏపీ సరిహద్దు వైన్​షాపులను  దక్కించుకున్న వ్యాపారుల పరిస్థితి  అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి అన్నట్టుగా  మారింది. ఒక్కొక్కరు రూ. లక్షలు పెట్టి సిండికేట్​ అయి పెద్దసంఖ్యలో  అప్లికేషన్లు వేస్తే అరకొరగా షాపులు దక్కాయి. అలా  డ్రాలో వైన్​​ షాపులు దక్కని వారు గుడ్​ విల్ ఇచ్చి మరీ బార్డర్​ షాపులను దక్కించుకున్నారు.  రెండేళ్లకు  లైసెన్స్​ఇవ్వడం, ఏడాది తర్వాత వరుసగా ఎన్నికలు జరగనుండడంతో అమ్మకాల మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ,  ఆంధ్రప్రదేశ్ లో అక్కడి  ప్రభుత్వం  మద్యం ధరలను తగ్గించడంతో సేల్స్​ పడిపోయాయి. ఏపీలో బ్రాండ్​ ను బట్టి ఒక్కో  బాటిల్ మీద  రూ.10 నుంచి  రూ.150 వరకు  రేట్లు తగించారు. తగ్గించిన రేట్లు ఈనెల 20 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో బార్డర్​ఏరియాల్లోని వైన్స్​ల్లో ఈ ఐదారు రోజుల్లోనే అమ్మకాలు బాగా పడిపోయాయని ఎక్సైజ్​ఆఫీసర్లు చెబుతున్నారు. ఇయర్​ ఎండ్​, న్యూ ఇయర్​ సేల్స్​ బాగా తగ్గుతాయని వారు అంటున్నారు.  

బార్డర్​ షాపులకు డిమాండ్​
ఈసారి లిక్కర్​ షాపులకు డిమాండ్​ బాగా పెరిగింది.  గవర్నమెంట్ కు​ అప్లికేషన్ల ఫీజు   ద్వారానే  రూ.1,357 కోట్ల రాబడి వచ్చింది. గత నెలలో 2,620 షాపులకు  టెండర్లు నిర్వహించగా,  67,849 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో  ఖమ్మం జిల్లాలోని 122 షాపులకు స్టేట్​లోనే  ఎక్కువగా  6,212 అప్లికేషన్లు వచ్చాయి. ఏపీ బార్డర్​లోని షాపులకున్న డిమాండే ఇందుకు కారణం. ఈ షాపులను దక్కించుకునేందుకు ఏపీకి చెందిన వ్యాపారులు కూడా టెండర్లలో పాల్గొన్నారు. డ్రాలో షాపులలు రాకపోయినా బార్డర్ దుకాణాలను ఎక్కువ గుడ్ విల్ ఇచ్చి మరీ చేజిక్కించుకున్నారు. ముదిగొండ, ఎర్రుపాలెం మండలాల్లోని షాపులకు  రూ.కోటికి పైగా గుడ్​ విల్ ఇచ్చి మద్యం సిండికేట్లు కొనుక్కున్నాయని టాక్​ ఉంది. 

తగ్గిన సేల్స్​​
రాష్ట్రంలో డిసెంబర్​ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభమయ్యాయి.  ప్రతి షాపులో మినిమమ్​​ స్టాక్​ఉండేలా కనీసం రూ.20 లక్షల విలువైన మద్యాన్ని  అందుబాటులో ఉంచుకుంటారు. తర్వాత ప్రతి వారం సేల్స్​ కు తగట్టు స్టాక్​ తెప్పించుకుంటారు. పండుగలు, ఇయర్​ ఎండ్ లాంటి అకేషన్స్ లో సేల్స్​ఎక్కువగా ఉంటాయని  స్టాక్​ కూడా ఎక్కువ తెప్పిస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోవడంతో గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు కనీసం 15 శాతం తక్కువ  స్టాక్​ తెప్పించినట్టు చెబుతున్నారు. వచ్చే నెలలో  స్టాక్​మరింత తగ్గవచ్చునని అంటున్నారు. 

అటు నుంచి లిక్కర్​ రావచ్చన్న  డౌట్స్​ 
ఏపీలో మొన్నటి దాకా లిక్కర్​ రేట్లు ఎక్కువ ఉండడంతో అక్కడి నుంచి చాలామంది మన స్టేట్​కు వచ్చి తాగేవారు. కొందరు అక్రమంగా లిక్కర్​ను బార్డర్​ దాటించి అక్కడ అమ్ముకునేవారు. దీంతో ఈ మండలాల్లోని వైన్స్​ల్లో అమ్మకాలు భారీగా ఉండేవి.  బెల్టు షాపులకు కూడా గిరాకీ జోరుగా ఉండేది. దీంతో జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ల టార్గెట్ కంటే 35 శాతం వరకు ఎక్కువ సేల్స్​ ఉండేవి.  ఇప్పుడు సీన్​ రివర్స్​ అయింది. ఏపీలో రేట్లు తగ్గడంతో ఎవరూ ఇక్కడ నుంచి లిక్కర్​ తరలించడంలేదు. పైగా ఏపీ నుంచే లిక్కర్​ తెలంగాణకు తరలిస్తారేమోనని  ఎక్సైజ్​ సిబ్బంది, వ్యాపారులు అనుమానిస్తున్నారు. దీంతో సరిహద్దు షాపుల్లో మద్యం అమ్మకాలు పడిపోకుండా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. మన రాష్ట్రంలో లిక్కర్​ టెండర్ల ప్రక్రియ ముగిసిన 15 రోజుల తర్వాత ఏపీలో ట్యాక్స్​ లు తగ్గించారు. ఇండియన్​ మేడ్ ఫారిన్ లిక్కర్ పై 5 నుంచి 12 శాతం వరకు, అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకు రేటు ను తగ్గించారు. లిక్కర్​ అక్రమ రవాణాను,  నాటు సారా తయారీని అరికట్టేందుకు రేట్లు తగ్గించినట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. దీంతో బ్రాండ్ ను బట్టి క్వార్టర్​ పై రూ.10 నుంచి రూ.30 వరకు, ఫుల్ బాటిల్ పై రూ.100 నుంచి 120 వరకు మన రాష్ట్రంలో కంటే ఏపీ లిక్కర్​ రేట్లు తగ్గిపోయాయి.