అంగన్వాడీ పట్ల నిర్లక్ష్య వైఖరి వీడాలి

అంగన్వాడీ పట్ల నిర్లక్ష్య వైఖరి వీడాలి

నల్గొండ అర్బన్, యాదగిరి గుట్ట,  వెలుగు : అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.  నిరవధిక సమ్మె లో భాగంగా మంగళవారం అంగన్వాడీ ఉద్యోగులు ఐసీడీఎస్‌ ఆఫీసు నుంచి క్లాక్ టవర్‌‌ వరకు శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శవయాత్ర నిర్వహించారు.

Also Read : నిమజ్జనానికి రెడీ అయిన లక్ష గణేష్ విగ్రహాలు

అనంతరం ఆమె దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పోరాడే సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం, తుర్కపల్లి, ఆలేరులో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతో పాటు పెన్షన్, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు రూ.10 లక్షలు, ఆయాలకు రూ.5 లక్షలు చెల్లించాలని, రూ.5 లక్షల ప్రమాదబీమా కల్పించాలని డిమాండ్ చేశారు.