మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ కు వ్యూహం?.. రంగంలోకి దోవల్

మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ కు వ్యూహం?.. రంగంలోకి దోవల్
  • కేంద్రం వ్యూహం ఏమిటి? దోవల్ తో మాట్లాడిన ప్రధాని

న్యూఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత దేశంలో ఉగ్ర కార్యకలాపాలు తగ్గిపోయాయని చెప్పుకొంటున్న మోడీ
సర్కార్​.. తాజా ఉగ్రదాడికి బదులు తీర్చుకోనుందా? ఉరీ దాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్ చేపట్టిన ఇండియన్​ ఆర్మీ ఇప్పుడు ఏం చేయబోతోంది ? ఒకవైపు జవాన్ల కుటుంబాల ఆర్తనాదాలు.. మరో వైపు ప్రతిపక్షాల విమర్శలు.. వీటి నడుమ కేంద్రం ఎలాంటి స్టెప్ తీసుకోనుంది? పుల్వామా ఉగ్రదాడి విషయం తెలియగానే యావత్​ దేశం ఉలిక్కిపడింది. ప్రధాని మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. జవాన్ల ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని, ఆ త్యాగం వృథా కానివ్వబోమని ప్రధాని ట్విటర్​లో పేర్కొన్నారు. ప్రధాని ఆదేశాలతో రంగంలోకి దిగిన దోవల్ గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వారి నుంచి వివరాలు తెప్పించుకున్నారు.

కొంతకాలంగా ఉనికిలో లేకుండా పోయిన జైషే మహ్మద్​ ఉగ్ర సంస్థ మళ్లీ ఈ దాడితో తెరపైకి రావడం కలకలం సృష్టిస్తోంది. జైషే మహ్మద్​ మూలాలు పాకిస్థాన్​ కేంద్రంగా ఉన్నాయని భద్రతా బలగాలు చెప్తున్నాయి. కశ్మీర్​లోని యువతకు జైషే మహ్మద్​ సంస్థ వలవేసి ఉగ్ర చర్యలకు ఉసిగొల్పుతోంది. సూసైడ్ బాంబర్​ ఆదిల్ కూడా అలానే సంస్థలో చేరాడు.

అణువణువూ గాలింపు
కశ్మీర్​లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న ప్రాంతాల్లో బలగాలు సోదాలు మొదలు పెట్టాయి. అణువణువునూ గాలిస్తున్నాయి. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాయి. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.

కేంద్రం భారీ ప్లాన్

తాజా ఉగ్రదాడి నేపథ్యంలో మరో సారి సర్జికల్ స్ట్రయిక్ చేయాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది. ఆలస్యం చేస్తే ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఉగ్రదాడి మోడీ సర్కార్​ను ఇబ్బందుల్లో పడేసింది. పెద్ద నోట్ల రద్దు, తాము అనుసరిస్తున్న విదేశీ విధానం ఫలితంగా దేశంలో ఉగ్ర చర్యలు తగ్గిపోయాయని కొంత కాలంగా సర్కార్​ పెద్దలు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ దాడి జరగడంపై ప్రభుత్వాన్ని అన్నివర్గాలు వేలెత్తి చూపుతున్నాయి . దీని నుంచి బయటపడాలంటే.. తక్షణంగా ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిందేనని కేంద్రం భావిస్తోంది. 2016 సెప్టెంబర్​ 29న పాక్ ఉగ్ర
స్థావరాలపై జరిగిన సర్జికల్ స్ట్రయిక్ ను నడిపించిన వారిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్ ఒకరు. ఇప్పుడు ఆయనే రంగంలోకి దిగడంతో ఉగ్రవాదులను అణచేందుకు కేంద్రం భారీ
ప్లాన్​ వేసినట్లు అర్థమవుతోంది.
నేడు రాజ్ నాథ్ పర్యటన
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్​ శుక్రవారం కశ్మీర్​లో పర్యటించనున్నారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఆయన.. పుల్వామాలో ఘటనా స్థలిని పరిశీలించనున్నారు. ఉగ్రదాడి ఘటన తెలుసుకున్న వెంటనే.. కశ్మీర్​ గవర్నర్​, సీఆర్​పీఎఫ్​ డీజీతో మాట్లాడారు.