- సీనియర్ అసిస్టెంట్ కూడా
- సర్వే చేయడానికి రూ.3 లక్షల డిమాండ్ చేసి చిక్కిన ఆఫీసర్లు
గోదావరిఖని : భూమిని సర్వే చేసేందుకు రూ. లక్ష లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ పి.సంపత్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అజీమ్, మరో వ్యక్తి లింగస్వామి ఏసీబీ అఫీసర్లకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం..అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి శివారులో సర్వే నెంబర్ 105, 107 మధ్యలో ఉన్న 12 ఎకరాల భూమికి హద్దులు నిర్ణయించాలని, దీని కోసం సర్వేయర్కు మెమో జారీ చేయాలని మేరుగు(పెద్దంపేట) శంకర్గౌడ్ రెవెన్యూ ఆఫీస్లో గత నెల 30న దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి తహసీల్దార్సంంపత్ రూ.3 లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు రూ.50 వేలు ఇస్తానన్నాడు. దీనికి సంపత్అంగీకరించలేదు. మధ్యవర్తిగా సీనియర్ అసిస్టెంట్ రంగంలోకి దిగి తహసీల్దార్ వినడం లేదని, అడిగినంత ఇవ్వాల్సిందేనన్నాడు. దీంతో మొదట రూ.లక్ష ఇస్తానని ఒప్పుకున్న బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
సోమవారం ఏసీబీ అధికారుల సూచన మేరకు శంకర్గౌడ్ అంతర్గాం తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లగా తహసీల్దార్తో పాటు సీనియర్ అసిస్టెంట్ కనిపించలేదు. డబ్బులను ఎవరికి ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ అజీమ్కు ఫోన్ చేయగా, తన ప్రైవేటు పర్సనల్ అసిస్టెంట్ లింగస్వామికి ఇచ్చి వెళ్లాలని సూచించాడు. అతడికి రూ.లక్ష అందజేస్తుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సెలవులో ఉన్న అజీమ్ను అతడి ఇంటి దగ్గర, తహసీల్దార్ సంపత్ను కలెక్టరేట్ ల్ అదుపులోకి తీసుకున్నారు. వీరిని అంతర్గాం తహసీల్దార్ ఆఫీసుకు తీసుకువచ్చారు. మంగళవారం కరీంనగర్ జైలుకు తరలించనున్నట్టు డీఎస్పీ తెలిపారు. దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు సంజీవ్, రాము, రవీందర్, తిరుపతి, జాన్రెడ్డి, సునీల్ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం : -
దవాఖాన్ల దత్తతకు సర్కారు యోచన
SSC ఎగ్జామ్స్ రోజు విషాద ఘటనలు