ఇరాక్ లో ప్రధాని అదిల్ కి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. బగ్దాద్ లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. 3 రోజులుగా ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అయితే అల్లర్లలో సుమారు 34 మంది మృతి చెందారు. మరో 1500 మంది వరకు గాయపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, విద్యుత్ కోతలను వ్యతిరేకిస్తూ వరుసగా మూడో రోజు కూడా ప్రజలు వేలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.
ప్రధాని అదిల్ రాజధాని బాగ్దాద్ లో ఆంక్షలు విధించినా నిరసనకారులు ఏమాత్రం లెక్కచేయలేదు. దేశ చిహ్నమైన లిబరేషన్ స్క్వేర్ వద్దకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై పోలీసులు, సైనికులు కాల్పులు జరిపారు. కాగా ప్రభుత్వం గద్దె దిగేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిరసనకారులు చెబుతున్నారు. నిరసన కారులతో చర్చలు జరిపేందుకు ప్రధాని అదిల్ ప్రయత్నించారు. రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలన్నారు. శాంతి భద్రతలు నెల కొల్పేందుకు సహకరించాలని ప్రధాని కోరారు.