
- తొలుత జీబీ లింక్ ద్వారా నీటిని తమిళనాడుకు తరలించే యోచన
- ఇది పూర్తయ్యాక గోదావరి-సోమశిల లింక్ చేపట్టేలా ప్రణాళిక
- ఈ నెల 12న ఎన్డబ్ల్యూడీఏ టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్
- ఆ రోజు జరగాల్సిన జీసీ లింక్ కన్సల్టెన్సీ మీటింగ్ 24కు వాయిదా
- ముందే టాస్క్ఫోర్స్ మీటింగ్ పెట్టడంపై అనుమానాలు
హైదరాబాద్, వెలుగు: గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టుపై ఏపీ, కేంద్రం కలిసి కొత్త ఎత్తుగడ వేశాయి. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టేలా గోదావరి జలాలను దోచుకెళ్లేందుకు వ్యూహం పన్నుతున్నాయి. గోదావరి– కావేరి లింకింగ్మాటున.. జీబీ లింక్ను అధికారికంగా ముందుకు తీసుకెళ్లే కుట్రకు తెరలేపుతున్నాయి.
నదుల అనుసంధానంలో భాగంగా కేంద్రం ప్రతిపాదించిన జీసీ (గోదావరి –కావేరి) లింక్ను పక్కకు పడేసి.. ‘గోదావరి –సోమశిల– కావేరి’ లింక్గా మార్చి చేపట్టే ప్రతిపాదనలనూ తెరపైకి తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్ను గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 12న (గురువారం) నిర్వహించబోతున్నారు. వాస్తవానికి ఈ నెల 12న జీసీ లింక్పై కన్సల్టెన్సీ మీటింగ్ను హైదరాబాద్ జలసౌధలో ఎన్డబ్ల్యూడీఏ నిర్వహించాల్సి ఉంది.
కానీ, ఆ మీటింగ్ను ఈ నెల 24కు వాయిదా వేశారు. 12న టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్ను నిర్వహించబోతున్నారు. వాస్తవానికి కన్సల్టెన్సీ మీటింగ్ నిర్వహించాక టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే రెండింటినీ కలిపి నిర్వహించాలి. కన్సల్టెన్సీ మీటింగ్లో సభ్య రాష్ట్రాలు చెప్పే అభిప్రాయాలకు తగ్గట్టుగా టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్లో చర్చించాల్సి ఉంటుంది.
కానీ, ఇక్కడ మాత్రం తొలుత టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్ను కేంద్రం నిర్వహించబోతున్నది. దీని వెనుక ఏపీ ప్రభుత్వ పెద్దలున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పెద్దల రాయబారంతోనే ముందుగా టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్నిర్వహించేందుకు కేంద్రం ఓకే చెప్పిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జీబీ లింక్కు సహకారం కోసమే..
కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అందులో భాగంగానే గోదావరి నుంచి తమిళనాడుకు తాగునీటిని తరలించేందుకు గోదావరి –కావేరి లింకింగ్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇప్పటికే ఆరు మీటింగులు నిర్వహించినా సభ్య రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరడం లేదు. మరోవైపు ఏపీ కూడా గోదావరి –కావేరి లింక్ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నది.
ఇప్పటికే గోదావరి నీళ్లను (పోలవరం నుంచి) తరలించేందుకు నిర్మించిన పట్టిసీమ నుంచి లింక్ ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదిస్తూ వస్తున్నది. అయితే, కేంద్రం దానికి వ్యతిరేకంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే గోదావరి–సోమశిల–కావేరి లింక్తో కొత్త కుట్రలకు ఏపీ, కేంద్రం పాల్పడుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తున్నది. అయితే, దానికన్నా ముందు జీబీ లింక్ను పూర్తి చేస్తే.. తొలిదశలో జీబీ లింక్ ద్వారానే తమిళనాడుకు నీటిని తరలించుకోవచ్చన్న ప్రతిపాదనను కేంద్రం ముందు ఏపీ పెట్టినట్టు తెలుస్తున్నది.
జీబీ లింక్తో బనకచర్ల వరకు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి.. అక్కడి నుంచి ఎలాగూ సోమశిలకు నీటిని తరలించొచ్చని, అక్కడి నుంచి కావేరికి లింక్ చేసుకోవచ్చన్న ప్రతిపాదనను కేంద్రం వద్ద పెట్టినట్టు సమాచారం. ఆ తర్వాత గోదావరి జలాలను మరింత మళ్లించుకుపోయేలా గోదావరి– సోమశిల లింక్నూ చేపట్టనున్నట్లు తెలిసింది.
ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఇటు ఏపీ రాయలసీమకు నీటిని దొడ్డిదారిలో తరలించేందుకు రెండు వైపులా అవకాశాలు ఏర్పడుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటు కేంద్రం చేపట్టాలనుకున్న రివర్ లింకింగ్ గోదావరి– సోమశిలతో తీరుతుందన్న చర్చ కూడా నడుస్తున్నది. అందులో భాగంగా జీసీ లింక్ను పక్కనపడేసే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే టాస్క్ఫోర్స్ మీటింగ్?
జీసీ లింకింగ్ కోసం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ ఈ నెల 12న సమావేశం కానుంది. ఈ లింక్లో సభ్య రాష్ట్రాల నుంచి ఆమోదం లభించకపోవడంతో.. జీబీ లింక్, జీఎస్ లింక్ అంశాలపై చర్చించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏపీ, కేంద్రం కలిసి కుట్రపూరితంగానే టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్ను కన్సల్టెన్సీ మీటింగ్ కాకముందే నిర్వహించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే జీబీ లింక్కు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును గత నెల 23నే కేంద్రానికి ఏపీ సమర్పించింది.
ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా.. కేంద్రానికి జీబీ లింక్ రిపోర్టు అందిందని ప్రెస్మీట్లో చెప్పారు. అయితే, కేంద్రం మాత్రం అసలు ఏ రిపోర్టూ అందలేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడం గమనార్హం. అది కూడా ఏపీ రిపోర్టు సమర్పించిన5 రోజుల తర్వాత.. ఉత్తమ్కు లేఖ రాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీబీ లింక్కు అనుమతులు ఇవ్వొద్దంటూ ఇటు కేంద్ర జలశక్తి శాఖ, అటు ఆర్థిక శాఖకు ఈ ఏడాది జనవరి 22నే మంత్రి ఉత్తమ్ రెండు లేఖలు రాశారు. కానీ, ఆ లేఖలు అందిన 5 నెలలకుగానీ కేంద్రం నుంచి ప్రభుత్వానికి రిప్లై రాలేదు.
త్వరలోనే జీబీ లింక్ టెండర్లు..
జీబీ లింక్ ప్రాజెక్టుపై టెండర్లు పిలిచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును ఇప్పటికే సమర్పించిన ఏపీకి.. ప్రాజెక్టుకు అన్ని విధాలుగా అండగా ఉండేలా కేంద్రం హామీ ఇచ్చిందన్న చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమావేశం నిర్వహించినట్టు చెప్తున్నారు. ఆ మీటింగ్లో టెండర్లను పిలిచేందుకు చర్యలు ప్రారంభించాల్సిందిగా అధికారులను చంద్రబాబు ఆదేశించినట్టు తెలిసింది.
తొలిదశలో భాగంగా పోలవరం లింక్ పాయింట్ నుంచి నాగార్జునసాగర్ కుడి కాల్వ లింకింగ్ పనులకు సంబంధించి రూ.20 వేల కోట్లతో టెండర్లను సిద్ధం చేయాలని సూచించినట్టు సమాచారం. ఈ నెలాఖరులోపు ఏపీ టెండర్లను పిలిచేందుకు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఈ లోపే ఎన్డబ్ల్యూడీఏ టాస్క్ఫోర్స్ కమిటీ మీటింగ్, కన్సల్టెన్సీ మీటింగ్లను కేంద్రం నిర్వహించబోతుండడం గమనార్హం.