బనకచర్లపై ఏపీ, కేంద్రం కొత్త ఎత్తుగడ! గోదావరి-కావేరి లింక్ను గోదావరి-సోమశిల-కావేరి లింక్ గా మార్చే కుట్ర

బనకచర్లపై ఏపీ, కేంద్రం కొత్త ఎత్తుగడ! గోదావరి-కావేరి లింక్ను గోదావరి-సోమశిల-కావేరి లింక్ గా మార్చే కుట్ర
  • తొలుత జీబీ లింక్​ ద్వారా నీటిని తమిళనాడుకు తరలించే యోచన
  • ఇది పూర్తయ్యాక గోదావరి-సోమశిల లింక్ ​చేపట్టేలా ప్రణాళిక
  • ఈ నెల 12న ఎన్​డబ్ల్యూడీఏ టాస్క్​ఫోర్స్​ కమిటీ మీటింగ్​
  • ఆ రోజు జరగాల్సిన జీసీ లింక్​ కన్సల్టెన్సీ మీటింగ్​ 24కు వాయిదా
  • ముందే టాస్క్​ఫోర్స్​ మీటింగ్​ పెట్టడంపై అనుమానాలు

హైదరాబాద్, వెలుగు: గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్​ ప్రాజెక్టుపై ఏపీ, కేంద్రం కలిసి కొత్త ఎత్తుగడ వేశాయి. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టేలా గోదావరి జలాలను దోచుకెళ్లేందుకు వ్యూహం పన్నుతున్నాయి. గోదావరి– కావేరి లింకింగ్​మాటున.. జీబీ లింక్​ను అధికారికంగా ముందుకు తీసుకెళ్లే  కుట్రకు తెరలేపుతున్నాయి. 

నదుల అనుసంధానంలో భాగంగా కేంద్రం ప్రతిపాదించిన జీసీ (గోదావరి –కావేరి)  లింక్​ను పక్కకు పడేసి.. ‘గోదావరి –సోమశిల– కావేరి’ లింక్​గా మార్చి చేపట్టే ప్రతిపాదనలనూ తెరపైకి తీసుకొస్తున్నాయి.   అందులో భాగంగానే నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ అథారిటీ (ఎన్​డబ్ల్యూడీఏ) టాస్క్​ఫోర్స్​ కమిటీ మీటింగ్​ను గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 12న (గురువారం) నిర్వహించబోతున్నారు. వాస్తవానికి ఈ నెల 12న జీసీ లింక్​పై కన్సల్టెన్సీ మీటింగ్​ను హైదరాబాద్​ జలసౌధలో ఎన్​డబ్ల్యూడీఏ నిర్వహించాల్సి ఉంది. 

కానీ, ఆ మీటింగ్​ను ఈ నెల 24కు వాయిదా వేశారు. 12న టాస్క్​ఫోర్స్​ కమిటీ మీటింగ్​ను నిర్వహించబోతున్నారు. వాస్తవానికి కన్సల్టెన్సీ మీటింగ్​ నిర్వహించాక టాస్క్​ఫోర్స్​ కమిటీ మీటింగ్​ నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే రెండింటినీ కలిపి నిర్వహించాలి. కన్సల్టెన్సీ మీటింగ్​లో సభ్య రాష్ట్రాలు చెప్పే అభిప్రాయాలకు తగ్గట్టుగా టాస్క్​ఫోర్స్​ కమిటీ మీటింగ్​లో చర్చించాల్సి ఉంటుంది. 

కానీ, ఇక్కడ మాత్రం తొలుత టాస్క్​ఫోర్స్​ కమిటీ మీటింగ్​ను కేంద్రం నిర్వహించబోతున్నది. దీని వెనుక ఏపీ ప్రభుత్వ పెద్దలున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పెద్దల రాయబారంతోనే ముందుగా టాస్క్​ఫోర్స్​ కమిటీ మీటింగ్​నిర్వహించేందుకు కేంద్రం ఓకే చెప్పిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

జీబీ లింక్​కు సహకారం కోసమే..

కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అందులో భాగంగానే గోదావరి నుంచి తమిళనాడుకు తాగునీటిని తరలించేందుకు గోదావరి –కావేరి లింకింగ్​ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇప్పటికే ఆరు మీటింగులు నిర్వహించినా సభ్య రాష్ట్రాల మధ్య  అంగీకారం కుదరడం లేదు. మరోవైపు ఏపీ కూడా గోదావరి –కావేరి లింక్​ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నది. 

ఇప్పటికే గోదావరి నీళ్లను (పోలవరం నుంచి) తరలించేందుకు నిర్మించిన పట్టిసీమ నుంచి లింక్​ ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదిస్తూ వస్తున్నది. అయితే, కేంద్రం దానికి వ్యతిరేకంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే గోదావరి–సోమశిల–కావేరి లింక్​తో కొత్త కుట్రలకు ఏపీ, కేంద్రం పాల్పడుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తున్నది. అయితే, దానికన్నా ముందు జీబీ లింక్​ను పూర్తి చేస్తే.. తొలిదశలో జీబీ లింక్​ ద్వారానే తమిళనాడుకు నీటిని తరలించుకోవచ్చన్న ప్రతిపాదనను కేంద్రం ముందు ఏపీ పెట్టినట్టు తెలుస్తున్నది. 

జీబీ లింక్​తో బనకచర్ల వరకు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి.. అక్కడి నుంచి ఎలాగూ సోమశిలకు నీటిని తరలించొచ్చని, అక్కడి నుంచి కావేరికి లింక్​ చేసుకోవచ్చన్న ప్రతిపాదనను కేంద్రం వద్ద పెట్టినట్టు సమాచారం. ఆ తర్వాత గోదావరి జలాలను మరింత మళ్లించుకుపోయేలా గోదావరి– సోమశిల లింక్​నూ చేపట్టనున్నట్లు తెలిసింది. 

ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఇటు ఏపీ రాయలసీమకు నీటిని దొడ్డిదారిలో తరలించేందుకు రెండు వైపులా అవకాశాలు ఏర్పడుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటు కేంద్రం చేపట్టాలనుకున్న రివర్​ లింకింగ్​ గోదావరి– సోమశిలతో తీరుతుందన్న చర్చ కూడా నడుస్తున్నది. అందులో భాగంగా జీసీ లింక్​ను పక్కనపడేసే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అందుకే టాస్క్​ఫోర్స్​ మీటింగ్?

జీసీ లింకింగ్​ కోసం ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్​ కమిటీ ఈ నెల 12న సమావేశం కానుంది. ఈ లింక్​లో సభ్య రాష్ట్రాల నుంచి ఆమోదం లభించకపోవడంతో.. జీబీ లింక్​, జీఎస్​ లింక్​ అంశాలపై చర్చించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏపీ, కేంద్రం కలిసి కుట్రపూరితంగానే టాస్క్​ఫోర్స్​ కమిటీ మీటింగ్​ను కన్సల్టెన్సీ మీటింగ్​ కాకముందే నిర్వహించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే జీబీ లింక్​కు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును గత నెల 23నే కేంద్రానికి ఏపీ సమర్పించింది. 

ఇటీవల కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి కూడా.. కేంద్రానికి జీబీ లింక్​ రిపోర్టు అందిందని ప్రెస్​మీట్​లో చెప్పారు. అయితే, కేంద్రం మాత్రం అసలు ఏ రిపోర్టూ అందలేదంటూ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి లేఖ రాయడం గమనార్హం. అది కూడా ఏపీ రిపోర్టు సమర్పించిన5 రోజుల తర్వాత.. ఉత్తమ్​కు లేఖ రాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీబీ లింక్​కు అనుమతులు ఇవ్వొద్దంటూ ఇటు కేంద్ర జలశక్తి శాఖ, అటు ఆర్థిక శాఖకు ఈ ఏడాది జనవరి 22నే మంత్రి ఉత్తమ్​ రెండు లేఖలు రాశారు. కానీ, ఆ లేఖలు అందిన 5 నెలలకుగానీ కేంద్రం నుంచి ప్రభుత్వానికి రిప్లై రాలేదు. 

త్వరలోనే జీబీ లింక్​ టెండర్లు..

జీబీ లింక్​ ప్రాజెక్టుపై టెండర్లు పిలిచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును ఇప్పటికే సమర్పించిన ఏపీకి.. ప్రాజెక్టుకు అన్ని విధాలుగా అండగా ఉండేలా కేంద్రం హామీ ఇచ్చిందన్న చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమావేశం నిర్వహించినట్టు చెప్తున్నారు. ఆ మీటింగ్​లో టెండర్లను పిలిచేందుకు చర్యలు ప్రారంభించాల్సిందిగా అధికారులను చంద్రబాబు ఆదేశించినట్టు తెలిసింది. 

తొలిదశలో భాగంగా పోలవరం లింక్​ పాయింట్​ నుంచి నాగార్జునసాగర్​ కుడి కాల్వ లింకింగ్​ పనులకు సంబంధించి రూ.20 వేల కోట్లతో టెండర్లను సిద్ధం చేయాలని సూచించినట్టు సమాచారం. ఈ నెలాఖరులోపు ఏపీ టెండర్లను పిలిచేందుకు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఈ లోపే ఎన్​డబ్ల్యూడీఏ టాస్క్​ఫోర్స్​ కమిటీ మీటింగ్​, కన్సల్టెన్సీ మీటింగ్​లను కేంద్రం నిర్వహించబోతుండడం గమనార్హం.