- కృష్ణా నీళ్ల పంపకాలను రెండు రాష్ట్రాలకే పరిమితంచేయడం సరికాదంటూ వాదన
- ప్రధాని మోదీకి జగన్ లేఖ.. అమిత్షానూ కలిసి కంప్లయింట్
- న్యాయమైన వాటా ఇవ్వాల్సిందేనంటున్న తెలంగాణ
- ప్రాజెక్టుల వారీగా పంపకాలు వద్దని, క్యాచ్ మెంట్ ఏరియా లెక్కన చేపట్టాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నీళ్ల పంచాదిని పరిష్కరించాలని బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేయగా... ఏపీ మళ్లీ కిరికిరి మొదలుపెట్టింది. కృష్ణా బేసిన్లో నాలుగు రాష్ట్రాలు ఉండగా, నీటి పంపకాలను రెండు రాష్ట్రాలకే ఎలా పరిమితం చేస్తారని వాదిస్తోంది. ఇది తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూ ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్షానూ కలిసి ఫిర్యాదు చేశారు. ట్రిబ్యునల్ తదుపరి చర్యలు చేపట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రెండు రాష్ట్రాల మధ్యే నీటి పంపకాలు చేపట్టడం అశాస్త్రీయమని పేర్కొన్నారు. అయితే అమిత్ షాను జగన్ కలిసిన కొన్ని గంటల్లోనే నీటి పంపకాలపై బ్రజేశ్కుమార్ ట్రిబ్యునల్కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్(టీవోఆర్) ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ క్రమంలో దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కేంద్ర నిర్ణయం న్యాయ విరుద్ధమని, దీనిపై తమకున్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంటామని చెప్తోంది. బచావత్ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ ఏపీ సర్కార్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు కృష్ణా నీళ్లలో న్యాయమైన వాటా కోసం ఎందాకైనా వెళ్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికైనా ట్రిబ్యునల్కు రిఫర్ చేయడం అభినందనీయమని, దశాబ్దాలుగా తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కేంద్రాన్ని తెలంగాణ కోరుతోంది.
క్యాచ్ మెంట్ ఏరియా లెక్కన పంపిణీ జరగాలి: తెలంగాణ
కృష్ణాలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్లో పేర్కొంది. ఈ లెక్కన తెలంగాణ ఏర్పడే నాటికి ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నా ఏపీకే ఎక్కువ నీటిని కేటాయించే ప్రమాదముందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టుల ప్రాతిపదిక కాకుండా దుర్భిక్షం, క్యాచ్ మెంట్ ఏరియా (నదీ ప్రవాహ ప్రాంతం), సాగుభూమి ప్రాతిపదికగా నీళ్ల పంపకాలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ఎదుట ఇవే వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. మిగులు జలాల పంపిణీలోనూ తెలంగాణకే ఎక్కువ వాటా దక్కాలని అంటోంది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో నాగార్జునసాగర్కు ఎగువన ఉమ్మడి ఏపీకి దక్కే 45 టీఎంసీల్లో 40 టీఎంసీలను శ్రీశైలం లెఫ్ట్బ్యాంక్కెనాల్టన్నెల్ప్రాజెక్టుకు కేటాయించారు. ఈ లెక్కన 40 టీఎంసీలు తమకే ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. ఆ 40 టీఎంసీలకు తోడు మళ్లింపు నీటిలో మిగిలిన 5 టీఎంసీలను కూడా కలుపుకొని 45 టీఎంసీలను పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్స్కీమ్ కు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. ఈ నీటిపైనా ట్రిబ్యునల్ వద్ద గట్టి వాదనలకు తెలంగాణ సిద్ధమవుతోంది. మరోవైపు శ్రీశైలంపై ఆధారపడి ఏపీ ప్రభుత్వం 320 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను రాయలసీమ ప్రాంతంలో నిర్మించింది. వాటికి హక్కుల కోసం ఏపీ వాదనలకు రెడీ అవుతోంది.
అదనపు జలాలే పంపిణీ చేయాలి: ఏపీ
జస్టిస్ బచావత్ నేతృత్వంలోని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 ఉమ్మడి ఏపీకి 75% డిపెండబులిటీ వద్ద (వందేండ్లలో 75 ఏళ్లు వచ్చే వరద ఆధారంగా) కృష్ణా నదిలో 2,130 టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్క తేల్చి 1976 మే 31న నివేదిక ఇచ్చింది. ఇందులో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. ఈ నీటిని ప్రాజెక్టుల వారీగా కాకుండా ప్రాంతాల వారీగా చేయడంతో ఏపీ నీటి వినియోగంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లను మళ్లించుకుంటూ కృష్ణా బేసిన్ అవతల ఉన్న రాయలసీమకు శ్రీశైలం నీటిని మళ్లిస్తోంది. దీంతో తమకు న్యాయమైన వాటా దక్కడం లేదని తెలంగాణ మండిపడుతోంది.
కృష్ణా నదిలో 2,130 టీఎంసీల కన్నా అదనంగా లభ్యమయ్యే నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్ఇచ్చింది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్–1956లోని సెక్షన్6(1) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ రిపోర్టు.. సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని ప్రధాని మోదీకి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. 2004లో ఏర్పాటు చేసిన కేడబ్ల్యూడీటీ –2 2013 నవంబర్ 29న రిపోర్టు ఇచ్చిందని, 65% డిపెండబులిటీ లెక్కన ఉమ్మడి ఏపీకి అదనంగా 194 టీఎంసీలు కేటాయించిందన్నారు. కర్నాటక, మహారాష్ట్రకు ఇదే ప్రాతిపదికన అదనపు కేటాయింపులు చేసిందని, ఈ లెక్కన కృష్ణా నదిలో 2,578 టీఎంసీలకు మించి ఉన్న నీళ్లను వాడుకోవడానికి ఉమ్మడి ఏపీకే స్వేచ్ఛ ఉందని చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల కు భంగం వాటిల్లకుండా అదనపు జలాలు మాత్రమే పంపిణీ చేయాలని ప్రధానిని జగన్ కోరారు.