
హైదరాబాద్, వెలుగు: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్ట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర బెయిల్ కు విధించిన షరతులే రెగ్యులర్ బెయిల్ కు వర్తిస్తాయని ఉత్తర్వులో వెల్లడించింది. బెయిల్ ఆర్డర్ కండిషన్స్ ఖచ్చితంగా పాటించాలని చంద్రబాబును ఆదేశించింది. అయితే నమోదైన ఆరు కేసుల్లో రెండు కేసుల్లో మాత్రమే చంద్రబాబుకు బెయిల్ లభించింది.
మరో నాలుగు కేసుల్లో పీటీ వారెంట్స్ పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్న ఆయన ఈ నెల 28న రాజమండ్రి జైలులో సరెండర్ కావాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ అప్పీరియెన్స్ లో భాగంగా ఈ నెల 30న ఏపీ ఏసీబీ స్పెషల్ కోర్టులో మాత్రం హాజరుకావాలి. ట్రీట్ మెంట్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఏసీబీ కోర్టులో సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.