శ్రీశైలం దోపిడీకి ఏపీ రాచమార్గం!..రైట్​ మెయిన్​ కెనాల్ లైనింగ్​ పనులు మళ్లీ ప్రారంభం

శ్రీశైలం దోపిడీకి ఏపీ రాచమార్గం!..రైట్​ మెయిన్​ కెనాల్ లైనింగ్​ పనులు మళ్లీ ప్రారంభం
  • రైట్​ మెయిన్​ కెనాల్ లైనింగ్​ పనులు మళ్లీ ప్రారంభం
  • 44 వేల నుంచి 90 వేల క్యూసెక్కులకు చేరనున్న కెనాల్ కెపాసిటీ 
  • పనులు పూర్తయితే రోజూ 8 టీఎంసీలు తన్నుకుపోయేందుకు వీలు 
  • పనులను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్న కృష్ణా బోర్డు
  • కెనాల్‌‌‌‌ను 19 వేల క్యూసెక్కులతో మొదలుపెట్టి.. 90 వేల క్యూసెక్కులకు పెంచుతున్న ఏపీ 
  • ఎస్ఆర్ఎంసీ లైనింగ్​ పనులకు 2020లోనే జీవో.. 
  • తెలంగాణ ఫిర్యాదుతో 2023‌‌‌‌లో పనులు నిలిపివేత 
  • బ్రజేశ్‌‌‌‌ కుమార్​ ట్రిబ్యునల్‌‌‌‌లో తెలంగాణకు అనుకూలంగా తీర్పు వచ్చే చాన్స్​
  • అందుకే కెనాల్​ వర్క్స్ స్పీడప్‌‌‌‌ చేసిన ఏపీ.. రెండు, మూడు నెలల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు
  • లైనింగ్ ​పనులు ఆపాలంటూ తాజాగా కేఆర్ఎంబీకి తెలంగాణ​ లేఖ 

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరిన్ని నీళ్లు దోచుకునేందుకు ఏపీ లైన్​ క్లియర్​ చేసుకుంటున్నది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ కెపాసిటీని లక్షన్నర క్యూసెక్కులకు పెంచుకున్న పొరుగు రాష్ట్రం.. దాని కింద నిర్మించిన శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్ (ఎస్ఆర్ఎంసీ) ద్వారా పూర్తి స్థాయిలో నీటిని తరలించుకుపోయేందుకు వీలుగా వారం నుంచి లైనింగ్​ పనులను స్పీడప్ చేసింది. ఇప్పటివరకు లైనింగ్​ లేని ఈ కెనాల్ ద్వారా కేవలం 44 వేల క్యూసెక్కులనే తరలించే వీలుండగా.. రెండు, మూడు నెలల్లో లైనింగ్​ పూర్తి చేయడం ద్వారా రోజూ 90 వేల క్యూసెక్కుల (8 టీఎంసీలు) చొప్పున తన్నుకుపోయేలా కుట్ర చేస్తున్నది. ట్రిబ్యునల్‌‌‌‌లో కేసు నడుస్తున్నా, ఇరిగేషన్​ అవసరాలకు నీళ్లను ఔట్ సైడ్‌‌‌‌​బేసిన్‌‌‌‌కు తరలించడానికి వీల్లేదని బచావత్​ట్రిబ్యునల్ అవార్డు చెబుతున్నా.. ఏపీ అవేవీ లెక్క చేయకుండా ముందుకెళ్తున్నది. 

ఎస్ఆర్ఎంసీ లైనింగ్​పనులకు 2020 మే 5న ఏపీ జీవో జారీ చేసింది. 2023 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైనింగ్​పనులను ప్రారంభించింది. ఆనాడు తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో పనులను ఆపింది. అయితే ఇప్పుడు సెక్షన్​3పై బ్రజేశ్​కుమార్​ట్రిబ్యునల్ తెలంగాణ వాదనలు వింటుండడం, తీర్పు మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో.. ఏపీ కుట్రకు తెరలేపింది. వారం కింద ఎస్ఆర్ఎంసీ లైనింగ్​పనులను మళ్లీ ప్రారంభించింది. యమ స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనులు పూర్తి చేస్తున్నది. పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల రెగ్యులేటర్​వరకు 16.4 కిలోమీటర్ల పొడవుండే ఈ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే దాదాపు సగం మేర లైనింగ్​వర్క్స్​పూర్తి చేసినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కెనాల్​ఐదో కిలోమీటర్​ పాయింట్​వద్ద పనులు వేగంగా నడుస్తుండగా.. ఆ కింద కూడా వివిధ పాయింట్ల వద్ద పనులను స్పీడప్​ చేసినట్టు తెలుస్తున్నది. మొత్తంగా ఫ్లడ్​సీజన్​మొదలయ్యే మరో రెండు, మూడు నెలల్లో లైనింగ్​వర్క్స్​పూర్తి చేసి కెనాల్ పూర్తి సామర్థ్యం మేరకు శ్రీశైలం నుంచి నీటిని తోడుకపోవాలనే ఆలోచనలో ఏపీ ఉంది. మరోవైపు  పనులను అడ్డుకోవాల్సిన కృష్ణా రివర్​మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) మాత్రం చోద్యం చూస్తున్నది. ఈ క్రమంలో ఏపీ చేపట్టిన లైనింగ్​పనులను వెంటనే అడ్డుకోవాలంటూ తాజాగా  కేఆర్ఎంబీకి ఈఎన్సీ అనిల్​కుమార్​ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏపీని అడ్డుకోవాలని కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ.. 

శ్రీశైలం రైట్ మెయిన్​కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏపీ చేపడ్తున్న లైనింగ్​పనులను కృష్ణా బోర్డు అడ్డుకోకపోవడంపై తెలంగాణ తీవ్రంగా స్పందించింది. లైనింగ్​పనులను ఆపాలంటూ ఇప్పటికే 2023 సెప్టెంబర్, 2024 జులైలో రెండు సార్లు ఫిర్యాదు చేసినా బోర్డు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. లైనింగ్​పనులను చేపట్టకుండా ఏపీని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ మేరకు గురువారం కేఆర్ఎంబీకి ఈఎన్సీ అనిల్​కుమార్​లేఖ రాశారు. 1960 సెప్టెంబర్​తర్వాత చేపట్టిన అన్ని ప్రాజెక్టులకూ ఇన్​సైడ్​ బేసిన్​అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని బచావత్​ట్రిబ్యునల్​అవార్డు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. బచావత్​ట్రిబ్యునల్​కూడా కేవలం ఇన్​సైడ్​బేసిన్​ప్రాజెక్టులకే నీటి కేటాయింపులను చేసిందని స్పష్టం చేశారు. శ్రీశైలం కేవలం జలవిద్యుదుత్పత్తి కోసమే నిర్మించారని, ఔట్​సైడ్​ బేసిన్​కు నీటిని తరలించరాదంటూ ట్రిబ్యునల్​స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 

1976–77 ఒప్పందం ప్రకారం ఒపెన్​కెనాల్​ద్వారా చెన్నైకి 1500 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే తరలించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ.. శ్రీశైలం నుంచి పెన్నా బేసిన్​కు నీటిని తరలించే శ్రీశైలం రైట్​బ్రాంచ్​కెనాల్​(ఎస్ఆర్​బీసీ)కి శ్రీకారం చుట్టి.. సీడబ్ల్యూసీ ఆమోదం కోసం పంపిందని గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ భాగమైనందున సీడబ్ల్యూసీకి గానీ, ట్రిబ్యునళ్ల​ముందుగానీ తమ వాదన వినిపించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఏపీ తన తీరు మార్చుకోకుండా శ్రీశైలం రైట్​మెయిన్​కెనాల్​కు లైనింగ్​వర్క్స్​ను పూర్తి చేసేలా వేగంగా పనులను చేపడుతున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం అపెక్స్​కౌన్సిల్​అనుమతి లేకుండా, కృష్ణా బోర్డు ఆమోదం తెలపకుండా ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచేలా కెనాల్​కు ఎలాంటి లైనింగ్​పనులను చేపట్టడానికి అధికారం లేదని స్పష్టం చేశారు. కాబట్టి ఏపీ వెంటనే ఆ పనులను నిలుపుదల చేసేలా కృష్ణా బోర్డు జోక్యం చేసుకోవాలని, ఏపీని అడ్డుకోవాలని డిమాండ్​చేశారు. దాంతోపాటు రాయలసీమ లిఫ్ట్​ఇరిగేషన్ స్కీమ్ , ఎస్ఆర్​ఎంసీపై కేంద్ర జలశక్తి శాఖ, తెలంగాణకు ఏపీ స్టేటస్​ రిపోర్ట్​ ఇచ్చేలా 
ఆదేశించాలని కోరారు.

841 అడుగులకు  తగ్గగానే పనులు..

ఫ్లడ్​సీజన్‌‌‌‌లో శ్రీశైలంలో 841 అడుగుల వరకు నీళ్లుంటే ఏపీ పనులు చేసుకోవడానికి వీలు కావడం లేదు. ఆ నీటిమట్టం వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని ఏపీ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాటర్​ లెవల్​ అంతకు తగ్గితే నీటిని తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఈ క్రమంలో నెల క్రితం ప్రాజెక్టులో 841 అడుగుల దిగువకు నీటి మట్టం రాగానే.. ఎస్ఆర్ఎంసీ లైనింగ్ ​పనులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసిపెట్టుకున్నది. వివిధ పాయింట్ల వద్ద బ్యాచింగ్​ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసింది. పక్కా ప్రణాళిక ప్రకారం.. వారం రోజులుగా పనులు స్పీడప్​ చేసింది. ప్రస్తుతం బ్రజేశ్​ కుమార్ ​ట్రిబ్యునల్‌‌‌‌లో మన రాష్ట్రానికి అనుకూలంగా వాదనలు జరుగుతుండడం, సెక్షన్​ 3పైనే వాదనలు వింటుండడం.. తీర్పు మనకు అనుకూలంగా వచ్చే అవకాశాలూ ఉండడంతో ఏపీ ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్నదనే  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిబ్యునల్​ తీర్పు వచ్చేలోపు అన్ని పనులను పూర్తి చేసి పెట్టుకుంటే నీటి తరలింపులో అడ్డంకులు ఉండవన్న ఉద్దేశంతో ఏపీ ఈ కుట్రలకు తెరలేపిందన్న చర్చ జరుగుతోంది.

నాడు 1,500 క్యూసెక్కులకే అనుమతి.. 

శ్రీశైలం ప్రాజెక్టును కేవలం విద్యుదుత్పత్తి కోసమే వాడాలని 1973లో బచావత్ ​ట్రిబ్యునల్​స్పష్టంగా చెప్పింది. హైడ్రోఎలక్ట్రిక్​ ప్రాజెక్ట్​ కాబట్టి.. నీటిని ఇరిగేషన్​ అవసరాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడానికి వీల్లేదని ఆదేశించింది. అది కూడా ఔట్​సైడ్​ బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇరిగేషన్​అవసరాలకు తరలించకూడదని పేర్కొంది. ఒకవేళ తరలించాల్సి వస్తే కేవలం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడ్​ బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో 1977 అక్టోబర్​ 28న జరిగిన అగ్రిమెంట్​ప్రకారం.. చెన్నై తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక వాటర్​ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 టీఎంసీలకు మించకుండా 1,500 క్యూసెక్కులతో కాల్వలను డిజైన్​ చేయించాల ని సూచించింది. కానీ, చెన్నైకి తాగునీటి ముసుగులో ఏపీ పాలకులు ఔట్​సైడ్​ బేసిన్​ అయిన పెన్నా బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించే కుట్రకు తెర లేపారు. 

1980లలో మొదలైన ఆ జల దోపిడీ.. ఆ తర్వాత మరింత పెరిగి, ప్రస్తుతం రోజూ 8 టీఎంసీలు తరలించే స్థాయికి చేరింది. ఏపీ పాలకులు 1980లలో 44,600 క్యూసెక్కుల కెపాసిటీతో పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్, 19,150 క్యూసెక్కుల సామర్థ్యంతో శ్రీశైలం రైట్​మెయిన్​ కెనాల్​(అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్డ్), 48,525 క్యూసెక్కుల సామర్థ్యంతో బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టారు. 2005లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 1,56,100 క్యూసెక్కులకు, ఎస్ఆర్ఎంసీ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు, బనకచర్ల క్రాస్​ రెగ్యులేటర్​ సామర్థ్యాన్ని 81,975 క్యూసెక్కులకు పెంచారు. 2020లో ఎస్ఆర్ఎంసీ కెపాసిటీని 89,762 క్యూసెక్కులకు పెంచేలా లైనింగ్​పనులను చేపట్టేందుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏడాది మే 5న జీవో 203 ఇచ్చింది. ఇప్పుడు ఆ పనులను స్పీడప్​చేస్తోంది.