ఎస్పీ ఆఫీసులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ఎస్పీ ఆఫీసులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

నెల్లూరు: జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెద్దల నుండి రక్షణ కోసం పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించలేదన్న మనస్తాపంతో వారు తమ వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలను ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలోనే మింగడంతో పోలీసులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బుధవారం జరిగిన ఘటన కలకలం రేపింది. 
మాలకొండరాయుడు, లక్ష్మీప్రసన్న ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ పట్ల ఇరువైపులా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల నుంచి బెదిరింపులు వస్తుండడంతో ఫిర్యాదు చేసేందుకు దుత్తలూరు పోలీసు స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఫిర్యాదు తీసుకోకపోవడంతో నేరుగా జిల్లా ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లారు. జిల్లా ఎస్పీ ఆఫీస్‌లోనూ ఫిర్యాదు తీసుకునేవారెవరూ కనిపంచడం లేదని మనస్తాపంతో అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని సమాచారం. హుటాహుటిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.