- ఇండియా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియాలో పెరిగిన సేల్స్
- సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర లాభం రూ.2.42 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ కంపెనీ యాపిల్ ఆదాయం ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో 102.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్ల)కు పెరిగింది. కిందటేడాది ఇదే టైమ్తో పోలిస్తే 8 శాతం వృద్ధి సాధించింది. నికర లాభం రూ.2.42 లక్షల కోట్ల (27.5 బిలియన్ డాలర్ల) కు చేరుకుంది. ఇండియా నుంచి రికార్డ్ లెవెల్లో ఆదాయం వచ్చిందని కంపెనీ ప్రకటించింది.
యాపిల్ ఇండియాలో తన రిటైల్ నెట్వర్క్ను, తయారీని పెంచుతున్న విషయం తెలిసిందే. ‘‘డిసెంబర్ క్వార్టర్లో హిస్టారికల్ రిజల్ట్స్ను ప్రకటిస్తాం. ఐఫోన్ అమ్మకాలు భారీగా పెరుగుతాయి”అని కంపెనీ సీఈఓ టిమ్ కుక్ అన్నారు. సెప్టెంబర్ క్వార్టర్లో అమెరికా, కెనడా, లాటిన్ అమెరికా, పశ్చిమ యూరప్, మిడిల్ ఈస్ట్, జపాన్, కొరియా, దక్షిణాసియా సహా అనేక మార్కెట్లలో రికార్డ్ లెవెల్స్లో ఇన్కమ్ వచ్చిందని వివరించారు. యాపిల్ ఇటీవల భారత్, యూఏఈ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కొత్త స్టోర్లను ప్రారంభించింది.
సెప్టెంబర్లో ఐఫోన్ 17, 17 ప్రో, ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎయిర్, ఎయిర్పాడ్స్ ప్రో 3, కొత్త యాపిల్ వాచ్, మాక్బుక్ ప్రో, ఐపాడ్ ప్రోలను లాంచ్ చేసింది. కంపెనీ సీఎఫ్ఓ మాట్లాడుతూ, ఒక్క ఐఫోన్ సెగ్మెంట్ ఆదాయం 49 బిలియన్ డాలర్లుగా నమోదైందని అన్నారు. ఏడాది లెక్కన 6శాతం పెరిగిందని వివరించారు. ‘‘భారత్ సహా లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియాలో రికార్డు స్థాయి వృద్ధి కనిపించింది.
టారిఫ్ ఖర్చులు సెప్టెంబర్ క్వార్టర్లో 1.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. డిసెంబర్ క్వార్టర్లో ఇవి 1.4 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది”అని పేర్కొన్నారు.
