
నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ముంబయిలో అయితే ఎడతెరిపి లేకుండా సుమారు 14 గంటల నుంచి( వార్త రాసే సమయానికి) కురుస్తూనే ఉన్నాయి. గత ఆదివారం నుంచి ( జూన్ 25) ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. దాంతో లోతలోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
గత ఆదివారం ( జూన్ 25) నుంచి ముంబయిలో వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నగరంలోని అంధేరీ సహా పలు ఏరియాల్లోని అండర్పాస్లు, సబ్వేలలో వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు ఉదయం ( జూన్ 30) కూడా అంధేరీలో భారీ వర్షం పడటంతో సబ్వేలో భారీగా వరదనీరు నిలిచింది. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో అధికారులు నీటిని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ ముంబైలో జూన్ నెలలో కురువాల్సిన వర్షాల్లో 97 శాతం కురిశాయని అధికారులు తెలిపారు.
మరోవైపు ముంబైలోని ఆరేబియా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న మెరైన్ డ్రైవ్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డు) వైపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భారత వాతారణ శాఖ అధికారులు ప్రకటించారు.