మెల్బోర్న్: టీ20 వరల్డ్ కప్లో అందరూ ఎదురు చూస్తున్న బిగ్ ఫైట్కు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా–పాకిస్తాన్ ఆదివారం జరిగే గ్రూప్–2 మ్యాచ్లో లక్ష సీటింగ్ కెపాసిటీ ఉన్న ఎంసీజీ గ్రౌండ్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. సరిగ్గా ఏడాది కిందట ఇదే వరల్డ్ కప్.. ఫస్ట్ మ్యాచ్లో పాక్ చేతిలో ఓడిన టీమిండియా ఆ దెబ్బకు సెమీస్ కూడా చేరలేక ఇంటిదారి పట్టింది. ఐసీసీ టోర్నీలో పాక్ చేతిలో మన జట్టుకు అదే తొలి ఓటమి. గత నెల ఆసియాకప్ సూపర్4 పోరులోనూ ఇండియాను పాక్ దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో తాజా పోరులో పాక్ను చిత్తు చేసి ఆ పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా కసిగా ఉంది. అయితే, ఈ మ్యాచ్కు వాన ముప్పు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మెల్బోర్న్లో వాతావరణ పరిస్థితి చూస్తే కనీసం తక్కువ ఓవర్ల ఆట జరిగినా గొప్పే అనిపిస్తోంది. వచ్చే ఏడాది పాకిస్తాన్లో ఆసియా కప్ ఆడేది లేదంటూ బీసీసీఐ ప్రకటన చేయడం.. ఇండియాలో జరిగే వన్డే వరల్డ్కప్ను బహిష్కరిస్తామని పీసీబీ ప్రతిస్పందనతో ఇరు దేశాల మధ్య వాతావరణం వేడెక్కింది. దాంతో, ఈ మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇటు సూర్య.. అటు షాహీన్
ధోనీ కెప్టెన్సీలో అన్ని ఐసీసీ ఈవెంట్లలో పాక్పై గెలిచిన ఇండియా జోరుకు గత టీ20 వరల్డ్కప్లో బ్రేక్ పడింది. పాక్ స్పీడ్ స్టర్ షాహీన్ షా ఆఫ్రిది దెబ్బకు దుబాయ్లో మన బ్యాటర్ల దిమ్మతిరిగిపోయింది. ఆ ఓటమి అంత త్వరగా మరచిపోయేది కూడా కాదు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్, రాహుల్, కోహ్లీ మంచి టచ్లోనే ఉన్నప్పటికీ పవర్ ప్లేలో వీళ్లు షాహీన్ను ఎలా ఎదుర్కొంటారనేది మ్యాచ్ ఫలితానికి కీలకం అవనుంది. గాయం వల్ల ఆసియా కప్నకు దూరంగా ఉన్న షాహీన్.. వామప్ మ్యాచ్ల్లో తన మార్కు యార్కర్లతో ఇండియాకు ఇప్పటికే హెచ్చరికలు పంపాడు. కెరీర్ బెస్ట్ ఫామ్లో ఉన్న ఇండియా నం.1 బ్యాటర్ సూర్య కుమార్పై భారీ అంచనాలున్నాయి. టాప్3 బ్యాటర్లు ఫెయిలైతే షాహీన్ను దెబ్బకొట్టే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో, ఇద్దరి మధ్య సవాల్ ఆసక్తికరంగా మారనుంది. ఇక, బుమ్రా లేకపోవడంతో ఇండియా బౌలింగ్ వీక్ అయ్యింది. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గితే రోహిత్ ఛేజింగ్కే మొగ్గు చూపొచ్చు. కీపర్గా పంత్ బదులు కార్తీక్ను తీసుకుంటే లెఫ్టాండ్ బ్యాటర్ కమ్ స్పిన్నర్గా అక్షర్ పటేల్ తుది జట్టులో ఉంటాడు. మరో స్పిన్నర్ చహల్తో పోటీ ఉన్నప్పటికీ అశ్విన్కు మొగ్గు కనిపిస్తోంది. సీనియర్ పేసర్లు షమీ, భువనేశ్వర్కు తోడు లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ తుది జట్టులో ఉండొచ్చు. ఇక, ఈ మధ్యే న్యూజిలాండ్లో ట్రై సిరీస్ నెగ్గిన పాక్ జోరు మీదుంది. వరల్డ్ నం.1 బ్యాటర్ రిజ్వాన్ భీకర ఫామ్లో ఉండగా.. ఆసియా కప్లో నిరాశ తర్వాత కెప్టెన్ బాబర్ కూడా టచ్లోకి రావడంతో పాక్ టాపార్డర్ మళ్లీ బలంగా మారింది. షాహీన్, నసీమ్, రవూఫ్తో పేస్ బౌలింగ్ ఎలాగూ స్ట్రాంగ్గా ఉంది. కుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, నవాజ్తో కూడిన మిడిలార్డర్ కూడా రాణిస్తే పాక్కు తిరుగుండదు. కాబట్టి ఇండియా పక్కా ప్లాన్తో సమష్టిగా ఆడితేనే పాక్ను ఓడించి శుభారంభం చేయగలదు.